హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును విచారించేందుకు పంజాగుట్ట పోలీసులకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆదివారం నుంచి వారం రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు అనుమతి లభించడంతో చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీలో విధులు నిర్వహిస్తూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావుపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రణీత్ రావును ఈ నెల 12న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఎస్ఐబీ లాగర్ ఆఫీస్ లో హార్డ్ డిస్క్ల మార్పిడి, ధ్వంసం, డేటా ట్రాన్స్ఫర్ సహా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన సమాచారం రాబట్టాలని కోర్టుకు తెలిపారు. అయితే, కోర్టు మాత్రం వారం రోజులు మాత్రమే కస్టడీకి అనుమతి ఇచ్చింది. కాగా, విచారణలో ప్రణీత్ రావు వెల్లడించే వివరాల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.