ఫుడ్ పాయిజన్తో 31మంది విద్యార్థినులకు అస్వస్థత..నారాయణపేట జిల్లా ధన్వాడ ఆదర్శ పాఠశాలలో ఘటన

ఫుడ్ పాయిజన్తో 31మంది విద్యార్థినులకు అస్వస్థత..నారాయణపేట జిల్లా ధన్వాడ ఆదర్శ పాఠశాలలో ఘటన

ధన్వాడ, వెలుగు: నారాయణపేట జిల్లా ధన్వాడలోని ఆదర్శ పాఠశాల వసతి గృహానికి చెందిన 31 మంది ఇంటర్  స్టూడెంట్లు ఫుడ్​ పాయిజన్​తో అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్​లో మొత్తం 103 మంది విద్యార్థినులు ఉండగా, శనివారం 88 మంది హాజరయ్యారు. వీరంతా ఉదయం టిఫిన్​లో భాగంగా బోండా, పల్లి చట్నీ తిని క్లాస్​లకు వెళ్లారు. అక్కడ కడుపులో ఇబ్బందిగా ఉండడంతో ఆరుగురు హాస్టల్​కు వచ్చి నిద్రపోయారు. 

లంచ్  సమయంలో హాస్టల్​కు వచ్చిన స్టూడెంట్లలో పలువురు ఇబ్బంది పడగా, మరికొందరు లంచ్  చేయలేకపోయారు. అప్రమత్తమైన ప్రిన్సిపాల్, లెక్చరర్లు 31 మంది విద్యార్థినులను పీహెచ్ సీకి తరలించారు. డాక్టర్​ అనూష సూచన మేరకు 13 మందిని మెరుగైన చికిత్స కోసం108లో నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.

 మిగిలిన 18 మంది విద్యార్థినులకు స్థానికంగా చికిత్స అందజేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో రమేశ్, తహసీల్దార్  సింధూజ హాస్టల్​ను సందర్శించి వివరాలు సేకరించారు. ఫుడ్  సేఫ్టీ అధికారి మౌనిక హాస్టల్​కు చేరుకొని నిల్వ ఉన్న అల్లం పేస్ట్, పప్పులు పారవేయించారు.