- జడేజా, పూనమ్, అజయ్ ఠాకూర్ కూడా
- ‘ద్రోణాచార్య’కు బ్యాడ్మింటన్ గురు విమల్ పేరు సిఫారసు
అంతర్జాతీయ స్థాయిలో దేశానికి వన్నె తెచ్చి, కీర్తి పతాకను రెపరెపలాడించిన పలువురు క్రీడాకారులు జాతీయ పురస్కారాలు దక్కించుకోనున్నారు. రెజ్లర్ బజ్రంగ్, పారా అథ్లెట్ దీపా మాలిక్ ఖేల్రత్నకు నామినేట్ అవ్వగా, క్రికెటర్ రవీంద్ర జడేజా, తెలుగు షట్లర్ సాయిప్రణీత్ సహా 19 మంది ‘అర్జున’ అవార్డుకు ఎంపికయ్యారు. హాకీ లెజెండ్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా ఆగస్టు 29న నిర్వహించే నేషనల్ స్పోర్ట్స్ డే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా క్రీడాకారులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు.
న్యూఢిల్లీ: రియో పారా ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచిన దీపా మాలిక్ జాతీయ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అందుకోనుంది. జస్టిస్(రిటైర్డ్) ముకుందం శర్మ నేతృత్వంలోని 12 మంది సభ్యుల కమిటీ రెండో రోజు శనివారం నిర్వహించిన సమావేశంలో దీపా పేరును ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. తొలి రోజు శుక్రవారం జరిగిన సమావేశంలో రెజ్లర్ బజ్రంగ్ పునియాను ఖేల్ రత్నకు సిఫారసు చేశారు. 48 ఏళ్ల పారా అథ్లెట్ దీపా 2016 రియో పారా ఒలింపిక్స్లో షాట్పుట్ ఎఫ్ 53 కేటగిరిలో సిల్వర్ మెడల్ గెలిచింది. ఈ ఘనత సాధించిన దేశ తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అంతేకాక ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్లో చాంపియన్గా నిలిచింది. వెన్నెముకలో సోకిన ట్యూమర్ వల్ల నడుం కింది భాగం చచ్చుబడిపోవడంతో 17 ఏళ్లుగా దీప వీల్చైర్కు పరిమితమైంది. 2012లో అర్జున అవార్డు అందుకున్న దీప, 2017లో పద్శశ్రీ పురస్కారాన్ని స్వీకరించింది. గతేడాది జావెలిన్ త్రో, డిస్కస్ త్రో ఈవెంట్లకు మారిన దీప ఏషియన్ పారా గేమ్స్లో వరుసగా మూడు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించింది. 2010, 14, 18 ఏషియన్ పారా గేమ్స్లో దీప పతకాలు గెలిచింది. 2018 ఏషియాడ్లో డిస్కస్ త్రో, జావెలిన్ త్రో లో రెండు కాంస్య పతకాలు గెలిచింది. ఓ క్రీడలో వరుసగా నాలుగేళ్ల పాటు తిరుగులేని పెర్ఫార్మెన్స్ ఇచ్చిన క్రీడాకారులకు ఖేల్ రత్న అందిస్తారు. అవార్డుతో పాటు ఓ మెడల్, సర్టిఫికెట్, రూ.7.50 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.
‘అర్జున’కు 19 మంది
అర్జున అవార్డులకు ఈసారి మొత్తం 19 మందిని కమిటీ ఎంపిక చేసింది. బ్యాడ్మింటన్లో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న తెలుగు షట్లర్ సాయి ప్రణీత్, క్రికెటర్లు రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్స్ తేజిందర్పాల్ సింగ్ తూర్, మహ్మద్ అనాస్, స్వప్నా బర్మన్, ఫుట్బాల్ ప్లేయర్ గుర్ప్రీత్ సింగ్ సంధు, హకీ ప్లేయర్ చింగ్లెన్సెనా సింగ్, షూటర్ అంజుమ్ మౌద్గిల్ తదితరులు ఈ లిస్ట్లో ఉన్నారు. కాగా, కోచ్లకు అందించే ద్రోణాచార్య అవార్డుకు ఈసారి ముగ్గురిని నామినేట్ చేశారు. బాక్సర్ మేరీకోమ్ కోచ్ చోటెలాల్ యాదవ్, బ్యాడ్మింటన్ లెజెండ్, కోచ్ విమల్ కుమార్, క్రికెటర్ గౌతమ్ గంభీర్ చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ ఈ లిస్ట్లో ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురిని లైఫ్ టైమ్ విభాగంలో ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. యువతలో టాలెంట్ను గుర్తించి వారిని మేటి క్రీడాకారులుగా తీర్చిదిదుతున్న కోటాలో గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ బడ్డింగ్ అండ్ యంగ్ టాలెంట్ ఫౌండేషన్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారానికి ఎంపికైంది. స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ కేటగిరిలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ కూడా రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం దక్కించుకుంది.
జడ్డూకు గుర్తింపు
నాలుగేళ్లగా టీమిండియాలో కీలకంగా మారిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈసారి అర్జున అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇండియా క్రికెట్ జట్టు టెస్ట్లో వరల్డ్ నంబర్ వన్ స్థానం సాధించడంలో జడేజా కీలకపాత్ర షోషించాడు. 2013 ఏప్రిల్లో ఇండియా మహిళల క్రికెట్ టీమ్లో చేరిన పూనమ్ యాదవ్ తన లెగ్ స్పిన్ బౌలింగ్తో చాలా వేగంగా జట్టులో కీలక సభ్యురాలిగా మారిపోయింది. 2017 వరల్డ్కప్ ఫైనల్, 2018 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరిన ఇండియా జట్టులో పూనమ్ సభ్యురాలు.
కమిటీ దూరంగా మేరీ
కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ వివాదంలో ఇరుక్కోకుండా ఉండేందుకు స్టార్ బాక్సర్ మేరీ కోమ్ శనివారం జరిగిన అవార్డు సెలెక్షన్ కమిటీ సమావేశానికి దూరంగా ఉంది. ఆమె పర్సనల్ కోచ్ చోటెలాల్ యాదవ్ పేరు ద్రోణాచార్య రేసులో ఉండడమే ఇందుకు కారణం. ఒక దశలో మేరీ కమిటీ నుంచి పూర్తిగా తప్పుకోవాలని అనుకుందట.
ఫలించిన ప్రణీత్ నిరీక్షణ
ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ భమిడిపాటి సాయి ప్రణీత్ మూడేళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. 2017లో థాయ్లాండ్ ఓపెన్, సింగపూర్ ఓపెన్ల్లో విజేతగా నిలిచిన ప్రణీత్.. అప్పుడే తనకు అర్జున లభిస్తుందని ఆశించాడు. కానీ, 2018లో అతడి పేరును సిఫారసు చేయలేదు. గతేడాది అంతగా రాణించకపోయినప్పటికీ.. ఈ సీజన్లో సాయి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. మార్చిలో జరిగిన స్విస్ ఓపెన్లో రన్నరప్గా నిలిచాడు. జపాన్ ఓపెన్లో సెమీస్ చేరిన అతను వరల్డ్ ర్యాంకింగ్లో ప్రస్తుతం 19వ స్థానంలో ఉన్నాడు.
2018లోనే అవార్డు వస్తుందని అనుకున్నా. ఎందుకంటే 2017 నా కెరీర్లోనే బెస్ట్. ఈసారి చాలా టెన్షన్ పడ్డా. ఇప్పుడు రాకపోతే ఇకపై చాలా కష్టమవుతుంది. వరల్డ్ చాంపియన్షిప్స్కు రెండు రోజులు ముందు అవార్డు వార్త రావడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దేశం కోసం మరింత సాధించాలనే కోరికను రెట్టింపు చేసింది. – ప్రణీత్
ఖేల్ రత్న నామినేషన్లు
బజ్రంగ్ పునియా రెజ్లింగ్
దీపా మాలిక్ పారా అథ్లెటిక్స్
అర్జున
బి. సాయిప్రణీత్ బ్యాడ్మింటన్
తేజిందర్ పాల్ అథ్లెటిక్స్
మహ్మద్ అనాస్ అథ్లెటిక్స్
ఎస్.భాస్కరన్ బాడీ బిల్డింగ్
సోనియా లాథర్ బాక్సింగ్
రవీంద్ర జడేజా క్రికెట్
చింగ్లెన్సెనా సింగ్ హాకీ
అజయ్ ఠాకూర్ కబడ్డీ
గౌరవ్ సింగ్ మోటార్ స్పోర్ట్స్
ప్రమోద్ భగత్ పారా స్పోర్ట్స్
అంజుమ్ మౌద్గిల్ షూటింగ్
హర్మీత్ దేశాయ్ టేబుల్ టెన్నిస్
పూజా దండా రెజ్లింగ్
ఫౌవాద్ మిర్జా ఈక్వెస్ట్రియన్
గుర్ప్రీత్సింగ్ ఫుట్బాల్
పూనమ్ యాదవ్ క్రికెట్
స్వప్నా బర్మన్ అథ్లెటిక్స్
సుందర్ సింగ్ పారా అథ్లెటిక్స్
సిమ్రన్ సింగ్ షర్గిల్ పోలో
ద్రోణాచార్య (రెగ్యులర్ కేటగిరి)
విమల్ కుమార్ బ్యాడ్మింటన్
సందీప్ గుప్త టేబుల్ టెన్నిస్
మొహిందర్ సింగ్ అథ్లెటిక్స్
ద్రోణాచార్య (లైఫ్ టైమ్ కేటగిరి)
మెజ్బన్ పటేల్ హాకీ
రంబీర్ సింగ్ ఖోకర్ కబడ్డీ
సంజయ్ భరద్వాజ్ క్రికెట్
ధ్యాన్ చంద్ అవార్డు :
మన్యూల్ ఫ్రెడ్రిక్స్ హాకీ
అరూప్ బాసక్ టేబుల్ టెన్నిస్
మనోజ్ కుమార్ రెజ్లింగ్
నిట్టిన్ కిర్తానె టెన్నిస్
లాల్రెమ్సంగా ఆర్చరీ

