మేడిగడ్డకు గ్రౌటింగ్ సమస్య! ..చెప్పకుండానే ఎట్ల చేస్తరని అధికారులకు ఎన్​డీఎస్ఏ ప్రశ్న

మేడిగడ్డకు గ్రౌటింగ్ సమస్య! ..చెప్పకుండానే ఎట్ల చేస్తరని అధికారులకు ఎన్​డీఎస్ఏ ప్రశ్న
  • టెస్టుల పారామీటర్లు మారిపోతాయన్న నిపుణులు
  • మళ్లీ టెస్టులు చేశాకే ఫుల్ రిపోర్ట్ ఇస్తామని వెల్లడి
  • ఎనర్జీ డిసిపేషన్​పై జూనియర్ అధికారితో స్టడీ  
  • అన్నారం, సుందిళ్లలో 5 టీఎంసీల వరకు నింపుకోవచ్చన్న అభిప్రాయాలు 

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి గ్రౌటింగ్ చేయడమే సమస్యగా మారిందా? దానిపైనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్​డీఎస్ఏ) అభ్యంతరాలు చెబుతున్నదా? అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. సిఫార్సులు చేసిన టెస్టులు చేయకుండానే గ్రౌటింగ్ ఎందుకు చేశారంటూ ఇటీవల ఎన్​డీఎస్ఏ నిపుణులు ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. దాని వల్ల చేయాల్సిన టెస్టుల పారామీటర్స్ అన్ని మారిపోతాయని, మళ్లీ టెస్టులు చేయాలని సూచించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.

మళ్లీ 20 మీటర్ల లోతు వరకు బోర్​హోల్స్ తవ్వి సిఫార్సు చేసిన జియోటెక్నికల్, జియోఫిజికల్ టెస్టులను నిర్వహించాలని చెప్పినట్టు సమాచారం. వాస్తవానికి మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత.. గేట్లన్నింటినీ తెరిచి పెట్టాల్సిందేనని ఎన్​డీఎస్ఏ తేల్చి చెప్పింది. అయితే ఏడో బ్లాక్​లోని కుంగిన పిల్లర్ల కింద భారీ బుంగ పడినట్టు ఈ ఏడాది మేలో అధికారులు గుర్తించారు. దీంతో ఆ రంధ్రాన్ని పూడ్చేందుకు అధికారులు కాంక్రీట్ మిక్చర్​తో గ్రౌటింగ్ చేశారు. దీనిపైనే ఎన్​డీఎస్ఏ అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్తున్నారు.

కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా చేస్తారని ప్రశ్నించిందని చెబుతున్నారు. కానీ గ్రౌటింగ్ చేయడం వల్లే బ్యారేజీ గేట్లను ఎత్తగలిగామని, లేకపోతే మరింత నష్టం జరిగేదని అధికారులు అంటున్నారు. అయితే, మళ్లీ టెస్టులు చేసి ఆ రిపోర్టులు వచ్చాకే పూర్తి స్థాయి నివేదికను ఇస్తామని ఎన్​డీఎస్ఏ నిపుణులు తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ టెస్టులు పూర్తయి రిపోర్టులు వచ్చే వరకు ఎంత టైం పడుతుందోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ ఆఖరు నాటికైనా పూర్తి స్థాయి రిపోర్టు వస్తుందా? అన్న అనుమానాలు వస్తున్నాయి.  

ఎనర్జీ డిసిపేషన్​పై స్టడీ 

మేడిగడ్డ వద్ద ఎనర్జీ డిసిపేషన్(గేట్లను ఎత్తినప్పుడు వరద వేగానికి గేట్లకు దిగువన పడే వరద శక్తి/పీడనం)ను తగ్గించేందుకు అవసరమైన చర్యలను తీసుకునేందుకు అధికార వర్గాలు సిద్ధమవుతున్నాయి. అందుకు ఎనర్జీ డిసిపేషన్ మీద స్పెషలిస్ట్ అయిన ఓ జూనియర్ స్థాయి అధికారికి స్టడీ చేయించే బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.

ఆ అధికారిని ఐఐటీ రూర్కీకి పంపి ఎనర్జీ డిసిపేషన్​పై స్టడీ చేయిస్తున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి ఎనర్జీ డిసిపేషన్ ఏర్పాట్లు చేయకపోవడమూ ప్రధాన కారణమని మాజీ ఈఎన్​సీ సహా చాలా మంది అధికారులు కాళేశ్వరం జుడీషియల్ కమిషన్ ఎంక్వైరీలో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే బ్యారేజీకి అవసరమైన ఎనర్జీ డిసిపేషన్ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 

అన్నారం, సుందిళ్లలో 5 టీఎంసీలు నింపొచ్చు 

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వాడుకోవచ్చని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వాటిలో కనీసం 5 టీఎంసీల నీటిని నింపుకునేందుకు అవకాశం ఉందని, ఎలాంటి సమస్యలు రావని అంటున్నారు. ఇదే విషయంపై ఎన్​డీఎస్ఏకి పలు సూచనలు చేసినా.. ఎన్​డీఎస్ఏ అధికారులు వద్దని తేల్చి చెప్పారు. అయితే, ఇటు ఆయా బ్యారేజీల కాంట్రాక్ట్​ సంస్థలు కూడా వాటిలో నీళ్లు నింపుకుంటే ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇస్తున్నట్టు  తెలిసింది.

అవసరమైతే గేట్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి బ్యారేజీ మెయింటెనెన్స్​ను ఎన్​డీఎస్ఏ మానిటర్​ చేయొచ్చని కూడా అధికారులు చెప్పినట్టు తెలుస్తున్నది. ఎప్పటికప్పుడు బ్యారేజీల పరిస్థితులపై ఇన్ఫర్మేషన్ ఇస్తామని కూడా చెప్పినా ఎన్​డీఎస్ఏ వద్దని కరాఖండిగా చెప్పినట్టు సమాచారం.