బుడాపెస్ట్ : తన స్పీడ్తో ప్రపంచాన్ని ఊపేసిన స్ర్పింట్ లెజెండ్ ఉసేన్ బోల్ట్ 100 మీ. రన్ను పూర్తి చేసేందుకు పది సెకండ్లయినా తీసుకునేవాడు. ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. బోల్ట్ను మించిన వేగంతో.. ఒకే ఒక్క త్రో చేసి ఒలింపిక్స్ బెర్తు పట్టేశాడు. ఇలా వచ్చి.. అలా బల్లెంను విసిరి.. పారిస్ బెర్త్ అందుకొని ఔరా అనిపించాడు. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో ఇండియన్స్ అంతా నిరాశ పరుస్తుండగా.. నీరజ్ మాత్రం తనపై అంచనాలను నిలబెట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన మెన్స్ జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో గ్రూప్–ఎలో పోటీ పడ్డ నీరజ్ తన తొలి ప్రయత్నంలోనే జావెలిన్ను 88.77 మీటర్ల దూరం విసిరి టాప్ ప్లేస్తో ఫైనల్స్కు అర్హత సాధించాడు.
ఈ క్రమంలో 2024 పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫై మార్కు 85.50 మీటర్లను అలవోకగా దాటేశాడు. తన ఒలింపిక్ గోల్డ్ను నిలబెట్టుకు నేందుకు రెడీ అయ్యాడు. చోప్రాతో పాటు తోటి జావెలిన్ త్రోయర్లు డీపీ మను, కిశోర్ జెనా వరల్డ్ చాంపియన్షిప్స్లో తొలిసారి ఫైనల్కు క్వాలిఫై అయ్యారు. తొలిసారి ఈ టోర్నీలో పోటీ పడ్డ ఇరువురూ క్వాలిఫికేషన్లో ఆకట్టుకున్నారు. నీరజ్ గ్రూప్లోనే బరిలోకి దిగిన మను తన రెండో ప్రయత్నంలో 81.31 మీటర్ల దూరం విసిరి గ్రూప్లో మూడో ప్లేస్ ఓవరాల్గా ఆరో ప్లేస్ సాధించాడు.
ఈ టోర్నీకి వచ్చే ముందు వీసా సమస్యతో ఇబ్బంది పడ్డ జేనా 80.55 మీటర్లతో గ్రూప్–బిలో ఐదో, ఓవరాల్గా తొమ్మిదో ప్లేస్తో ఫైనల్స్కు క్వాలిఫై అయ్యాడు. వరల్డ్ అథ్లెటిక్స్ జావెలిన్ త్రోలో ముగ్గురు ఇండియన్స్ ఫైనల్కు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో నీరజ్ ఫేవరెట్గా బరిలోకి దిగనున్నాడు.
ఎనర్జీ కాపాడుకుంటూ..
గత ఎడిషన్లో సిల్వర్ నెగ్గి ఈసారి గోల్డ్పై గురి పెట్టిన నీరజ్ అందుకోసం పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నాడు. అందుకే క్వాలిఫికేషన్స్లో ఒకే ఒక్క త్రో చేసి తన ఎనర్జీని కాపాడుకున్నాడు. ‘వామప్ టైమ్లో నా పవర్ను గ్రహించా. ఒక్క త్రోతోనే ఫైనల్కు క్వాలిఫై అవ్వగలనని నాకు తెలుసు. జావెలిన్ను విసురుతున్నప్పుడు గొప్ప అనుభూతి కలిగింది.
రిజల్ట్ కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. క్వాలిఫికేషన్లో నేను కేవలం 90 శాతం ప్రయత్నంతో విసిరి ఫైనల్కు ఎనర్జీని కాపాడుకున్నా. ఈసారి గోల్డ్ నెగ్గాలని బలంగా కోరుకుంటున్నా. అందుకోసం ఫైనల్లో నా శక్తిమొత్తం ధారపోస్తాను’ అని నీరజ్ చెప్పుకొచ్చాడు. ఫైనల్లో నీరజ్కు సవాల్ విసిరే వారిలో పాకిస్తాన్కు చెందిన కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ అర్షద్ నదీమ్ 86.79 మీటర్లతో సెకండ్ ప్లేస్ సాధించాడు. అతను కూడా ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యాడు.
టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ నెగ్గిన జాకుబ్ వడ్లెచ్ (చెక్ రిపబ్లిక్) 83.50 మీటర్లతో మూడో ప్లేస్ సాధించగా.. జర్మనీకి చెందిన వెబర్ 82.39 మీటర్లతో నాలుగో ప్లేస్తో ఫైనల్కు వచ్చాడు. అయితే, డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) ఈసారి ఫైనల్కు క్వాలిఫై అవ్వలేకపోయాడు. కేవలం 78.49 మీటర్లతో ఓవరాల్గా 16వ స్థానంతో నిలిచి టోర్నీ నుంచి వైదొలిగాడు.