శుక్రవారం ( అక్టోబర్ 24 ) తెల్లవారుజామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం పెను విషాదంగా మారింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు బైకును ఢీకొట్టి పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన కుటుంబం బలయ్యింది. ఇద్దరు చిన్నపిల్లలు సహా గోళ్ల రమేష్ దంపతులు మృతి చెందారు.
గోళ్ల రమేష్ కుటుంబం నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లపాలెం అని తెలుస్తోంది. వృత్తి రీత్యా బెంగళూరులో స్థిరపడింది రమేష్ కుటుంబం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో రమేష్ సహా భార్య అనూష, చిన్నారులు శశాంక్, మన్హిత మృతి చెందారు. కుటుంబం మొత్తం ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదంగా మారింది.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. బస్సు పూర్తిగా దగ్ధమైందని.. బస్సులో నుంచి 11 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు చెప్పారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున 3 నుంచి 3.-10 గంటల సమయంలో బస్సు బైక్ ను ఢీకొనడంతో ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు.
బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలు వివరాల కోసం కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305 కు ఫోన్ చేసి సంప్రదించవచ్చునని కలెక్టర్ తెలిపారు.
