కట్నంకోసం వేధింపులు : నవ వధువు సూసైడ్

కట్నంకోసం వేధింపులు : నవ వధువు సూసైడ్

గుంటూరు : గృహ హింస నేరమని చట్టాలు చెబుతున్నప్పటికీ వరకట్న వేధింపులు ఆగడంలేదు. పెళ్లైన కొత్తలో భర్తతో సరదాగా గడపాల్సిన నవవధువును ఆట బొమ్మను చేశారు. కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. అత్తామామా, ఆడపడుచులు వెట్టిచాకిరితో నానా కష్టాలు పెట్టారు. దీంతో పెళ్లైన ఆరు నెలలకే ఆ నవ వధువు సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన ఏపీలోని గుంటూరులో జరిగింది.

వివరాలు : విజయవాడకు చెందిన ఓ యువకుడికి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన దుర్గ అనే అమ్మాయితో ఇటీవల పెళ్లైంది. చూడ చక్కనైన జంట అని అందరూ మెచ్చుకున్నారు. కానీ.. ఇంతలోనే భర్త, అత్తామామలు, ఆడపడుచులకు డబ్బు పిశాచి వెంటాడింది. అదనపు కట్నం కోసం దుర్గను వేధించడం మొదలుపెట్టారు. అందరినీ వదిలివచ్చిన ఆమెకు అన్ని విధాలుగా తోడు ఉండాల్సిన భర్త బాధ్యత మరిచాడు. ఆరు నెలలుగా వెట్టిచాకిరి చేయిస్తూ..నానా తిట్లు తిడుతున్నారు.

వారం రోజుల క్రితం తాడేపల్లిలోని తన పుట్టినింటికి వచ్చిన దుర్గకు భర్త నుంచి బెదిరింపులు వచ్చాయి. అదనపు కట్నంగా బంగారం తీసుకుని త్వరగా విజయవాడకు రావలని ఫోన్ చేసేవారు. దీంతో మనస్తాపానికి గురైన దుర్గ శనివారం ఉదయం ఉరివేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.