
పదవులపై హైకమాండ్తో సీఎం రేవంత్రెడ్డి చర్చించే చాన్స్
ఈ నెల 27తో ముగియనున్న పీసీసీ చీఫ్ పదవీకాలం
ఈ నెలాఖరుకు కొత్త చీఫ్ వచ్చే అవకాశం
వచ్చే నెల ఫస్ట్ వీక్లో మంత్రివర్గ విస్తరణ?
నామినేటెడ్ పోస్టులపై కూడా రానున్న క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: కొత్త పీసీసీ చీఫ్, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 27తో పీసీసీ చీఫ్ పదవీకాలం ముగియనుంది. దీంతో కొత్తగా ఎవరిని ఆ పోస్టులో నియమిస్తారన్నది ఆసక్తి రేపుతున్నది. త్వరలోనే కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందన్న ప్రచారం సాగుతున్నది. సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సోమవారం వెళ్లడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. వచ్చే నెల 2న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇటీవల వ్యాఖ్యానించారు. ఒకవైపు సీఎం హోదాలో రాష్ట్రానికి కేంద్ర సహాయం కోసం పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ కలుస్తున్నప్పటికీ.. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ హోదాలో కాంగ్రెస్ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు.
పీసీసీ చీఫ్గా ఎవరిని నియమించాలనే దానిపై, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో ఆయన చర్చించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. పీసీసీ చీఫ్ పోస్టును ఆశిస్తున్నవాళ్లు, కేబినెట్ లో బెర్త్ ఆశిస్తున్నవాళ్లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పలువురు ఢిల్లీలో మకాం వేశారు. కాగా, పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మూడేండ్ల పదవీకాలం ఈ నెల 27 తో ముగియనుంది. రాష్ట్రంలో త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నందున వాటిని దృష్టిలో పెట్టుకొని కొత్త చీఫ్ నియామకం జరగనుంది. ఈ నెలాఖరులోనే కొత్త పీసీసీ చీఫ్ను నియమిస్తారని, వచ్చే నెల ఫస్ట్ వీక్లో కేబినెట్ విస్తరణ ఉంటుందన్న చర్చ నడుస్తున్నది. నామినేటెడ్ పదవులపై కూడా సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఢిల్లీలో నేతల మకాం!
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి వెంట మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ నేతలు మహేశ్ కుమార్ గౌడ్, హర్కార వేణుగోపాల్ రావు, బల్మూరి వెంకట్ తదితరులు ఉన్నారు. మంగళవారం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో ప్రమాణం చేయనుండడంతో దీనికి ఈ నేతలు అటెండ్ కానున్నారు. కాగా.. పీసీసీ చీఫ్, మంత్రి పదవుల కోసం పలువురు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీలోనే మకాం వేశారు.
పీసీసీ చీఫ్ రేసులో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, సీనియర్ నేత అద్దంకి దయాకర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే తనకు ఇవ్వాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరుతున్నారు. ఆయన ఇటీవలే వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి తన పేరును పరిశీలించాలని పార్టీ పెద్దలను కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా మంత్రి పదవి లేదా పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.