బ్రిజ్ భూషణ్‌‌కు షాక్.. డబ్ల్యూఎఫ్ఐ కొత్త ప్యానెల్ సస్పెండ్

బ్రిజ్ భూషణ్‌‌కు షాక్.. డబ్ల్యూఎఫ్ఐ కొత్త ప్యానెల్ సస్పెండ్

డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడు, మాజీ చీఫ్ బ్రిజ్ భూషన్ సన్నిహితుడప సంజయ్ సింగ్ నేతృత్వంలోని కొత్త రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్యానెల్ ను క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. WFI బాడీ ఇప్పటికే ఉన్న నియమాలు, నిబంధనలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని పేర్కొంటూ మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని ప్రకటించింది. జాతీయ పోటీలకు సంబంధించిన ప్రకటన తొందరపాటుతో కూడుకున్నదని, సరైన ప్రక్రియను పాటించలేదని క్రీడా మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో తెలిపింది.

జూనియర్ నేషనల్ కాంపిటేషన్స్ ఈ ఏడాది చివరిలోపు ప్రారంభమవుతాయని కొత్తగా ఎన్నికైన సంఘం అధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ డిసెంబర్ 21న ప్రకటించారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది నిబంధనలకు విరుద్ధమని, రెజ్లర్లు సిద్ధం కావాలంటే కనీసం 15 రోజుల నోటీసు అవసరమని మంత్రిత్వ శాఖ వివరించింది. కొత్తగా ఏర్పాటు చేసిన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ పూర్తిగా మాజీ ఆఫీస్ బేరర్ల అధీనంలో ఉన్నట్టు, స్పోర్ట్స్ కోడ్‌ను పూర్తిగా ఉల్లంఘించినట్టు కనిపిస్తోందని స్పోర్ట్స్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో పేర్కొంది.

సంజయ్ సింగ్ గతంలో ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ బాడీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. డబ్ల్యూఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ జాయింట్ సెక్రటరీగా 2019 నుంచి ఉన్నారు. డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడంపై రెజ్లర్లు నిరసనకు దిగారు. సాక్షి మాలిక్ తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించగా, బజ్‌రంగ్ పునియా 'పద్మశ్రీ' అవార్డును తిరిగి ఇచ్చేస్తూ ప్రధానికి లేఖ రాశారు.