- భూ భారతి చట్టం ప్రకారం గ్రామాల్లో
- రికార్డు ఓపెన్ చేయనున్న రెవెన్యూ శాఖ
- భూమి సంక్రమణ వివరాలు కూడా రికార్డుల్లోకి
- భూస్వరూపం, పండించే పంటల సమగ్ర సమాచారం నమోదు
- 2014 లో ఆగిపోయిన పహాణీ రికార్డులు
- పదేండ్ల తర్వాత పునరుద్ధరణ
హైదరాబాద్, వెలుగు: పదేండ్లుగా ఆగిపోయిన పహాణీ రికార్డుల నిర్వహణను కొత్త సంవత్సరంలో మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అందులో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ‘భూ భారతి’ చట్టం ప్రకారం గ్రామాల్లోని రెవెన్యూ రికార్డులను ఓపెన్ చేసి.. ప్రస్తుతం సాగులో ఎవరున్నారు? ఎంత విస్తీర్ణం? అనే వివరాలతో పాటు.. అసలు ఆ భూమి రైతుకు ఏ రకంగా సంక్రమించింది? అనే కీలక సమాచారాన్ని కూడా నమోదు చేయనున్నారు.
2014 నుంచి ఆగిపోయిన మ్యాన్యువల్ రికార్డుల వ్యవస్థకు, డిజిటల్ భద్రతను జోడిస్తూ.. భూ యాజమాన్య హక్కులపై వస్తున్న అనుమానాలు, వివాదాలకు చెక్ పెట్టేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. కేవలం సాగు వివరాలే కాకుండా, భూమి హక్కు సంక్రమణ వివరాలను కూడా రికార్డుల్లోకి ఎక్కించనున్నారు. ఇక నుంచి ప్రతి ఏడాది పహాణీ రికార్డు అప్ డేట్ చేయనున్నారు.
అలాగే, గతంలో గ్రామ రెవెన్యూ సహాయకులు ఈ పహాణీ రాతలు రాసేవారు. కానీ, మారిన చట్టాలు, పరిపాలనా సంస్కరణల నేపథ్యంలో ఈ బాధ్యతలను ప్రభుత్వం కొత్త యంత్రాంగం చేతిలో పెడుతోంది. గ్రామ పంచాయతీల్లో ఉండే కొత్త జీపీవో (గ్రామ పాలన ఆఫీసర్)లకు ఈ పహాణీ రికార్డుల నిర్వహణ బాధ్యతను అప్పగించనుంది.ఇప్పటికే 3,500 మంది జీపీవోలను నియమించారు. మిగిలిన గ్రామాల్లోనూ త్వరలోనే నియమించనున్నారు.
దశాబ్ద కాలపు స్తబ్ధతకు తెర..
2014వ సంవత్సరం నుంచి రాష్ట్రంలో మ్యాన్యువల్ పహాణీ రికార్డుల నిర్వహణ అటకెక్కింది. డిజిటల్ విధానం పేరుతో క్షేత్రస్థాయిలో ప్రతి ఏటా జరగాల్సిన ‘జమాబందీ’ ప్రక్రియను గత పాలకులు పక్కన పెట్టారు. దీంతో పదేండ్లుగా గ్రామాల్లో భూముల లెక్కలు కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప, క్షేత్రస్థాయి వాస్తవాలకు అద్దం పట్టడం లేదు.
ఈ లోపాన్ని సరిదిద్దుతూ, కొత్త ఏడాది ఆరంభం నుంచే గ్రామాల్లో మళ్లీ పహాణీ రికార్డులను ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత రికార్డుల దుమ్ము దులిపి, భూ భారతి చట్టం ప్రకారం పక్కాగా ప్రతి సర్వే నంబర్ను నమోదు చేయనుంది. అలాగే, కొత్త పహాణీల్లో అత్యంత కీలకమైన అంశం ‘భూమి సంక్రమణ వివరాలు’. ఇన్నాళ్లు కేవలం పట్టాదారు పేరు మాత్రమే ఉండేది. కానీ, ఆ భూమి అతనికి ఎలా వచ్చింది అనేది రికార్డుల్లో స్పష్టంగా ఉండేది కాదు. తాజా నిర్ణయం ప్రకారం.. రైతుకు ఆ భూమి తాతల నుంచి వంశపారంపర్యంగా వచ్చిందా? రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశారా? ప్రభుత్వ అసైన్మెంట్ (లావణి) ద్వారా పొందాడా? లేదా గిఫ్ట్ డీడ్ (దాన విక్రయం) ద్వారా వచ్చిందా? అనే వివరాలను పహాణీలో ప్రత్యేక కాలమ్ లో నమోదు చేస్తారు.
సాగుదారుడికి గుర్తింపు..
భూమి పట్టాదారు ఒకరైతే.. దానిని సాగు చేస్తున్నది మరొకరు కావడం గ్రామాల్లో సర్వసాధారణం. పదేండ్లుగా పహాణీలు రాయకపోవడంతో వాస్తవ సాగుదారుల వివరాలు రికార్డుల్లో నమోదు కావడం లేదు. ఇప్పుడు ప్రతి సర్వే నంబర్లో ప్రస్తుతం ఎవరున్నారు? యజమానే సాగు చేస్తున్నారా? లేక కౌలుకు ఇచ్చారా? అనేది రాస్తారు.
పట్టాదారు పాస్ పుస్తకంలో పేరున్నా సరే, క్షేత్రస్థాయిలో సాగులో ఉన్న వ్యక్తి పేరును కూడా ‘అనుభవదారుడి’ కాలమ్ లో చేర్చడం ద్వారా ప్రభుత్వ పథకాలు, పంట నష్ట పరిహారం, ఇన్సూరెన్స్ వంటివి అర్హులైన వారికే అందే అవకాశం కలుగుతుంది. అలాగే, భూమి భౌతిక స్థితిని కూడా ఈ కొత్త పహాణీల్లో కూలంకషంగా పొందుపరచనున్నారు. అది సాగునీటి వసతి ఉన్న మాగాణి భూమా? వర్షాధార మెట్ట భూమా? లేక సాగుకు పనికిరాని రాళ్లూ రప్పలతో ఉన్న బీడు భూమా? అనే వివరాలు నమోదు చేస్తారు.
అలాగే, ఆ సీజన్ లో రైతు ఏ పంట వేశారనేది కూడా రికార్డు చేస్తారు. గతంలో మాదిరి కాకుండా వాణిజ్య పంటలు, ఉద్యానవన తోటల వివరాలను కూడా సేకరిస్తారు. ఈ సమగ్ర డేటా వల్ల ప్రభుత్వానికి పంటల దిగుబడిపై స్పష్టత రావడంతో పాటు, మార్కెటింగ్ ప్రణాళికలు వేయడానికి సులువు అవుతుంది.
సివిల్ తగాదాలు, సరిహద్దు గొడవలకు పరిష్కారం
గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం గొడవలు భూమి హక్కుల కోసమే జరుగుతుంటాయి. ముఖ్యంగా భూమి ఎలా వచ్చిందనే దానిపై స్పష్టత లేక దాయాదుల మధ్య గొడవలు, సరిహద్దు వివాదాలతో కోర్టుల మెట్లు ఎక్కుతారు. ఇప్పుడు పహాణీలోనే ‘మోడ్ ఆఫ్ అక్విజిషన్’ (సంక్రమణ విధానం) రాయడం వల్ల, ఆ భూమిపై హక్కు ఎవరిదో సులభంగా తేలిపోతుంది.
న్యాయస్థానాలు కూడా ప్రాథమిక సాక్ష్యంగా పరిగణించే పహాణీ రికార్డు పక్కాగా ఉండటంతో, సివిల్ కేసుల పరిష్కారం లో వేగం పెరుగుతుంది. రైతులకు ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది.
