
- జడ్పీ చైర్మన్లతో భేటీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
- కొంతకాలం ఓపికగా ఉండాలని సూచన
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. ఈసారి 15 ఏండ్లు రాష్ట్రాన్ని పాలిస్తుందని ఆ పార్టీ ప్రెసిడెంట్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పవర్లో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి, ప్రజలతో చీ అనిపించుకోవడం కాంగ్రెస్ లక్షణమని ఆయన విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అదే జరిగిందన్నారు. మంగళవారం ఎర్రవల్లిలోని తన ఫామ్హౌజ్లో బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లు, వారి కుటుంబ సభ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జడ్పీ చైర్మన్లు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారని ఆయన కొనియాడారు. ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చాక ఆ తర్వాత అధికారం ఉన్నా.. లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులని అన్నారు. పార్టీ నుంచి పోయేటోళ్లను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మళ్లీ కొత్త నాయకులను తయారు చేస్తామన్నారు. కొంతకాలం ఓపికగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మరో రెండేండ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని ఆయన అన్నారు. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు. ఈసారి బీఆర్ఎస్ తరఫున ఎవరికి బీ ఫామ్ దక్కితే వాళ్లదే విజయమన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పార్టీ అన్ని స్థాయిల కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామన్నారు. సోషల్ మీడియాను కూడా పటిష్టంగా తయారు చేస్తామన్నారు. బంగ్లాదేశ్లో హష్మీ అనే ఒక ప్రొఫెసర్ పేద మహిళల కోసం 71 వేల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వారిని ఆదుకున్న విధానం గురించి, జీరో పొల్యూషన్ నగరాల్లో అక్కడి మేయర్లు ప్రజల్లో మమేకమైన విధానం గురించి కేసీఆర్ జడ్పీ చైర్మన్లకు వివరించారు.
కాంగ్రెస్ పాలనలో మతకల్లోలాలు
పదేండ్ల తమ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు, తాగునీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్య తలెత్తిందని, మతకల్లోలాలు కూడా చెలరేగుతున్నాయని కేసీఆర్ ఆరోపించారు. ‘‘కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామంటున్నారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు మరి దాన్ని చెరిపేస్తారా?”అని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చినంక గతంలో వైఎస్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల పేర్లు మార్చకుండా ఇంకా బాగా అమలు చేశామని గుర్తుచేశారు.
రైతుబంధు పథకానికి ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. సాగు చేస్తేనే రైతుబంధు అనే కాన్సెప్ట్ వల్ల, ఈ స్కీమ్లోనూ అవినీతి మొదలవుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.