
న్యూఢిల్లీ, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఫ్యాక్టరీలోని ప్రొపెల్లెంట్ మిక్సింగ్ యూనిట్లో సంభవించిన పేలుడు ఘటనను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలు కావడంతో ఆందోళన వ్యక్తం చేసింది. రెండు వారాల్లో ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సోమవారం తెలంగాణ సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.
పేలుడు పదార్థాల తయారీ ఫ్యాక్టరీలోని ప్రొపెల్లెంట్ మిక్సింగ్ యూనిట్లో జరిగిన పేలుడుపై మీడియాలో వచ్చిన వార్తలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టింది. ఈ ఘటన 2025 ఏప్రిల్ 29న జరిగింది. ఈ వార్తా కథనంలోని అంశాలు నిజమైతే బాధితుల మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన అంశాలను లేవనెత్తుతాయని కమిషన్ అభిప్రాయపడింది. దీనిపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని నివేదికలో పొందుపర్చాలని కోరింది.