- ఈహెచ్ఎస్ ట్రస్ట్, ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఈహెచ్ఎస్ అమలులో రాజీ పడబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రజా భవన్లో సీఎస్ సంజయ్ జాజుతో కలిసి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, జీఏడీ, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా తమవారేనని, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, డిపెండెంట్లు గానీ అనారోగ్యానికి గురైనప్పుడు ఇబ్బందులు పడకుండా ఈ పథకాన్ని సీరియస్గా తీసుకుని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో ఇప్పటికే 354 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండగా, డీమ్డ్ ఎంప్యానెల్డ్ విధానంలో మరికొన్ని ఆసుపత్రులను చేర్చినట్లు ప్రకటించారు.
అన్నీ హాస్పిటల్స్ యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి, స్కీమ్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఈ పథకాన్ని ఎవరూ ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు.
గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలే..
గత బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విమర్శించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని హెల్త్ కార్డు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, వారి కుటుంబాల సంక్షేమం విషయంలో ఈ ప్రభుత్వం అత్యంత సీరియస్గా, కమిటెడ్గా ఉందన్నారు.
ఈహెచ్ఎస్ స్కీమ్ను విజయవంతం చేయడంలో అధికారులు, ఉద్యోగ సంఘాలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ సమీక్షలో జేఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కా, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టీనా, ఎడ్యుకేషన్ సెక్రటరీ మోగితా రాణా, ఈహచ్ఎస్ సీఈఓ హనుమంతు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాసరావు, లచ్చిరెడ్డితో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
