టీఆర్ఎస్పై స్టూడెంట్ సంఘాల ఫైర్
ఓయూ, వెలుగు: నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి, నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) నాయకులపై టీఆర్ఎస్వీ నేతల దాడిని నిరసిస్తూ ఓయూలో ర్యాలీ నిర్వహించారు. బీఎస్ఎఫ్, బీజేఎస్, ఈబీసీ, జీవీఎస్, టీవీఎస్, ఎన్టీవీఎస్, ఎన్టీఎస్యూ, యువజన కాంగ్రెస్, ఓయూ జేఏసీ స్టూడెంట్ సంఘాల నేతలు శుక్రవారం ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ చేశారు. రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రూప్స్ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు చచ్చిపోతుంటే.. సీఎం కేసీఆర్ పుట్టినరోజు పేరుతో రూ.వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. స్టూడెంట్లతో పెట్టుకున్న ఏ పార్టీ బతికి బట్టకట్టలేదని, రేపు టీఆర్ఎస్కు అదే గతి పడుతుందన్నారు. టీఆర్ఎస్వీ స్టూడెంట్ నేతల ఆగడాలు మితిమీరిపోయాయని, ప్రశ్నించే స్టూడెంట్లపై దాడులకు దిగుతున్నారని, వారి వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఆందోళనలో విద్యార్థి సంఘాల నాయకులు బైరు నాగరాజు, వేల్పుల సంజయ్, తిరుపతి, ప్రతాప్రెడ్డి, సురేశ్ యాదవ్, శరత్ నాయక్, అరుణ్ కుమార్, అర్జున్ బాబు తదితరులు పాల్గొన్నారు.