సూర్యాపేట, వెలుగు: మర్కజ్ వెళ్లి వచ్చిన ఓ ఆర్ఎంపీని క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచిస్తే.. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి మాత్రం అడ్డుకున్నాడు. దీంతో సదరు ఆర్ఎంపీ దర్జాగా క్లినిక్ను ఓపెన్ చేసి ప్రాక్టీస్ సాగించాడు. ఆ ఆర్ఎంపీకి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. అతడి వద్ద ట్రీట్మెంట్కు వచ్చిన 36 మంది క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇది సూర్యాపేట జిల్లా నేరెడుచర్లలో కలకలం రేపుతోంది.
ఆర్ఎంపీ నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధి వత్తాసు..
నేరేడుచర్ల మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ మార్చిలో ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చాడు. అదే సమయంలో రాష్ట్రంలో మర్కజ్ లింక్ కరోనా కేసులు ఎక్కువగా నమోదవడం మొదలయ్యాయి. దీంతో స్థానిక అధికారులు నేరెడుచర్లలోని వారి వివరాలు ఆరా తీశారు. ఈ క్రమంలో ఆర్ఎంపీ కూడా మర్కజ్ వెళ్లి వచ్చినట్లు తేలింది. దీంతో క్వారంటైన్లో ఉండాలని ఆర్ఎంపీకి అధికారులు సూచించగా.. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అడ్డుచెప్పాడు. వ్యాధి లక్షణాలు లేనందున క్వారంటైన్ అవసరం లేదని అధికారులపై ఒత్తడి తెచ్చాడు. దీంతో అధికారులు ఆర్ఎంపీని విడిచిపెట్టారు. ఇదే అదునుగా సదరు ఆర్ఎంపీ నేరెడుచర్లలోని తన క్లినిక్లో ప్రాక్టీస్ సాగించాడు. నాలుగురోజుల క్రితం అధికారులు ఆర్ఎంపీ శాంపిల్స్ను టెస్టులకు పంపించగా.. ఈ నెల 16న కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడ్ని గాంధీ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆ ఆర్ఎంపీ ఎవరెవరికి ట్రీట్మెంట్ చేశాడు..? ఎవరెవరిని కలిశాడు? అని అధికారులు ఆరా తీస్తున్నారు. సుమారు 36 మందికి సదరు ఆర్ఎంపీ ట్రీట్మెంట్ అందించినట్లు గుర్తించారు. వారందరినీ క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. ఆ 36 మంది శాంపిల్స్ను సేకరించి టెస్టుల కోసం పంపించారు. ఒక ఆర్ఎంపీ నిర్లక్ష్యం, అతడికి ఓ ప్రజాప్రతినిధి వత్తాసు పలకడం.. ఫలితంగా నేరెడుచర్లలో టెన్షన్ నెలకొంది.