
ముంబై: దేశంలోని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల మొండి బాకీలు (ఎన్పీఏ) పదేళ్ల దిగువ లెవెల్3.9 శాతానికి తగ్గాయి. మార్చి 2023 చివరి నాటికి ఈ లెవెల్కు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు వెల్లడించింది. ఆయా బ్యాంకులపై మాక్రో స్ట్రెస్ టెస్టులను నిర్వహించినట్లు పేర్కొంది. తగినంత క్యాపిటల్ ఉండటంతో వత్తిడి ఎదురైనా ఆ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు తట్టుకోగలవని ఈ రిపోర్టు తెలిపింది. మార్చి 2018 నాటికి 11.5 శాతంగా ఉన్న గ్రాస్ ఎన్పీఏ రేషియో మార్చి 2023 నాటికి 3.9 శాతానికి తగ్గిపోయింది. ఇదే కాలానికి నెట్ ఎన్పీఏ రేషియో కూడా 6.1 శాతం నుంచి 1.0 శాతానికి దిగిపోయింది.
కానీ, కొన్ని నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీలకు ఎక్కువ లెవరేజ్ కనబడుతోందని, వాటి వల్ల సిస్టమ్కు రిస్క్ ఉందని ఆర్బీఐ తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టులో పేర్కొంది. మార్చి 2023 నుంచి గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. అయితే, మన దేశంలోని ఫైనాన్షియల్ సెక్టార్ మాత్రం ఈ టైములో పటిష్టంగా ఉందని పేర్కొన్నారు.
బ్యాంకులు ఇచ్చే అప్పులు కూడా నిలకడగా పెరుగుతున్నాయని, వాటి ఎన్పీఏలు తగ్గుతున్నాయని, క్యాపిటల్ నిల్వలు తగినంతగా ఉన్నాయని వివరించారు. మే 2023 లో నిర్వహించిన సిస్టమిక్ రిస్క్ సర్వేలో దేశంలోని చాలా కేటగిరీలలో రిస్క్ తక్కువగానే ఉన్నట్లు తేలిందన్నారు. కాకపోతే, గ్లోబల్ పరిణామాల నేపథ్యంలో కొంత ఎఫెక్ట్ పడే ఛాన్సులున్నాయని దాస్ చెప్పారు. గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్పై నమ్మకం తగ్గుతున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది అభిప్రాయపడినట్లు ఆర్బీఐ తాజా రిపోర్టు తెలిపింది. దేశంలోని ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటర్లు అందరి దగ్గరి నుంచీ తీసుకున్న సమాచారంతో ఏడాదికి రెండు సార్లు ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టును ఆర్బీఐ ప్రకటిస్తోంది.