- టెస్టులు, సర్జరీల కోసం నిమ్స్, ప్రైవేట్ దవాఖానాలకు రెఫర్
- ఎర్రగడ్డ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వింత పరిస్థితి
- రెఫరల్ లెటర్ల కోసం పేషెంట్ల సహాయకులకు కష్టాలు
హైదరాబాద్, వెలుగు: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐ) కార్డుదారులు, కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రతి నెలా జీతాల్లోంచి కాంట్రిబ్యూషన్ డబ్బులు కట్అవుతున్నా సక్కగా వైద్యం అందట్లేదు. రోగమొచ్చిన మొదట్లోనే హాస్పిటల్కు పోయినా ముదిరేంత వరకు ట్రీట్మెంట్చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఓపీ నుంచి ఐపీ వరకు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈఎస్ఐ కార్డుదారులకు హెల్త్ ప్రాబ్లమ్స్వస్తే ముందుగా సంబంధిత డిస్పెన్సరీల్లో డాక్టర్లను సంప్రదిస్తే అవసరమైన వారిని ఈఎస్ఐ హాస్పిటల్కురెఫర్ చేస్తారు. అక్కడ కూడా ట్రీట్ మెంట్అందుబాటులో లేకపోతే ఎర్రగడ్డ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు పంపిస్తారు. ఇక్కడ అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నా, చాలా డిపార్టుమెంట్లలో ట్రీట్ మెంట్ సరిగా చేయడంల లేదని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడంతో చిన్న టెస్టులకు కూడా రెండు, మూడ్రోజుల సమయం పడుతుందని పేర్కొంటున్నారు. సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ కావాలంటే వారంపైనే అవుతుందని పేషెంట్ల బంధువులు వాపోతున్నారు. గుండెకు సంబంధించి యాంజియోగ్రామ్ టెస్టు కావాలంటే వేరే హాస్పిటల్కు వెళ్లక తప్పడం లేదు. సర్జరీ చేయాలన్నా, గుండెకు సంబంధించిన ఈసీజీలో చిన్న సమస్య వచ్చినా యాంజియోగ్రామ్ టెస్టులు చేయక తప్పడం లేదు. ఈ టెస్టు ఇక్కడ లేదంటూ వేరే హాస్పిటల్స్కురెఫర్ చేస్తున్నారు. అక్కడకు వెళ్లి ఇన్ పేషెంట్లో అడ్మిట్ అయి టెస్టు చేసుకొని ఆ రిపోర్టు వచ్చేంత వరకు సర్జరీ వాయిదా వేస్తున్నారు. ప్రతి రోజు ఇదే పరిస్థితి ఉంటుంది. ఆస్పత్రిలో అందుబాటులోని ట్రీట్ మెంట్ కోసమే రెఫర్ చేస్తున్నామని ఈఎస్ఐ డాక్టర్లు చెబుతున్నారు.
హైదరాబాద్ రీజియన్లో 23 డిస్పెన్సరీలు
హైదరాబాద్ రీజియన్లోని హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో 23 డిస్పెన్సరీలు ఉండగా, నాచారం, ఆర్సీపురంలో రెండు హాస్పిటల్స్ ఉన్నాయి. వీటితో పాటు హైదరాబాద్లో రెండు, మిగతా జిల్లాలకు ఒక లోకల్ఆఫీసులు ఉన్నాయి. లోకల్ ఆఫీసులో కార్డుదారులకు సంబంధించిన సెలవులు అప్లయ్ చేసుకోవడం, పేమెంట్స్కి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి. 7 లక్షల మంది ఎంప్లాయీస్ ఉండగా వారి ఫ్యామిలీ మెంబర్స్కలిపితే 20 లక్షల మంది ఉంటారు. ఇంత మందికి సరిపడా ఫెసిలిటీస్ మాత్రం కల్పించడం లేదని అంటున్నారు.
రెఫరల్ పై వెళ్తే ఇబ్బందులు
ఎర్రగడ్డ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో లేని ట్రీట్ మెంట్ కోసం నిమ్స్తో పాటు మరికొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కు రెఫర్ చేస్తున్నారు. వారానికోసారి రెఫరల్ లెటర్ఈఎస్ఐ నుంచి తీసుకురావాలనే నిబంధన ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. వారానికోసారి లెటర్ కోసం ఈఎస్ఐకి వస్తే ఫార్మాలిటీస్పేరుతో రోజంతా గడిచిపోతుందని, పేషెంట్పరిస్థితి ఎలా ఉన్నా రెఫరల్ లెటర్ కోసం తిరగక తప్పడం లేదని పేషెంట్ల బంధువులు ఆవేదన
వ్యక్తం చేస్తున్నారు.
మందులకే రూ.50 వేలు ఖర్చయినయ్
ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నాన్నను అడ్మిట్ చేస్తే నెల రోజులు ఉంచుకొని యాంజియోగ్రామ్ టెస్టు కోసమని నిమ్స్కు రెఫర్ చేశారు. ఇక్కడ టెస్టు కోసం వారం రోజులు అడ్మిట్అయినం. క్యాథ్ ల్యాబ్ లేదని మళ్లీ నిమ్స్లో సర్జరీ చేసుకోమని రెఫర్ చేశారు. రెండు సర్జరీలకు నెల రోజులు పట్టింది. రెండుసార్లు రెఫరల్ లెటర్లు తెచ్చిన. ఎవరు చెప్పలేదని మూడోసారి లెటర్తేకుంటే డిశ్చార్జీ చేశాక మూడ్రోజులు ఉండాల్సి వచ్చింది. ఇంజక్షన్లు, మెడిసిన్స్ బయటి నుంచి తెచ్చుకుంటే రూ.50 వేలు అయినయ్.
- రమేశ్ కుమార్, సంగారెడ్డి జిల్లా
మెడిసిన్స్ ఇవ్వట్లే
ఈఎస్ఐలో ట్రీట్ మెంట్పొందుతున్న వారితో పాటు రెఫర్పై ఇతర హాస్పిటల్స్కు వెళ్లిన వారికి అన్నిరకాల మెడిసిన్స్ అందించాల్సి ఉన్నప్పటికీ నిమ్స్ తో పాటు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్కువ ధర ఉండే మందులు బయట నుంచి కొని తెచ్చుకోమని పేషెంట్లకు చెబుతున్నారు. మందుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయక తప్పడం లేదని పేషెంట్ల బంధువులు వాపోతున్నారు. ఈఎస్ఐలో పేరుకే ఫ్రీ ట్రీట్ మెంట్అని, మందులకే వేలాది రూపాయలు ఖర్చవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్నుంచి డిశ్చార్జీ అయిన పేషెంట్లకు డిస్పెన్సరీల్లో మందులు ఇవ్వాల్సి ఉన్నా, లేవని చెప్పి పంపుతున్నారు.