న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ డ్రగ్స్ ధరలపై పరిమితులు విధించడంతో 651 రకాల మందుల ధరలు ఈనెల నుంచి సగటున 6.73 శాతం తగ్గాయని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ప్రకటించింది. మెజారిటీ మందుల ధరలను ప్రభుత్వం తగ్గించిందని తెలిపింది. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్ఎల్ఈఎం)లోని మొత్తం 870 షెడ్యూల్డ్ డ్రగ్స్లో ఇప్పటివరకు 651 మందుల సీలింగ్ ధరలను ప్రభుత్వం తగ్గించగలిగిందని ఎన్పీపీఏ ట్వీట్ చేసింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2022లో ఎన్ఎల్ఈఎంలో మార్పులు చేసి మొత్తం 870 మందులను చేర్చింది. ఎన్పీపీఏ నిర్ణయాల ఫలితంగా 651 ఎసెన్షియల్ డ్రగ్స్ ధరలు ఇప్పటికే 16.62 శాతం తగ్గాయి. నిజానికి వీటి ధరలు ఈ నెల నుంచి 12.12 శాతం పెరగాల్సి ఉండగా, తాము తగ్గించామని ఎన్పీపీఏ తెలిపింది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) ఆధారంగా మందుల ధరలు గతంలో వార్షికంగా 12.12 శాతం పెరిగినప్పటికీ, తాజాగా ధరల తగ్గుదల వల్ల యూజర్లు ప్రయోజనం పొందుతారని పేర్కొంది. ఎన్ఎల్ఈఎం లిస్టులోని మందుల ధరల్లో మార్పులు డబ్ల్యూపీఐ ఆధారంగా ఉంటాయి.