సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా బయటపడింది. నల్గొండ జిల్లా మాల్ గ్రామానికి చెందిన సౌందర్య(25) నర్సింగ్ కళాశాలలో చదువుతూ ఆస్పత్రిలో సేవలందిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని ఆస్పత్రి ఆవరణలోనే ఉన్న నర్సింగ్ హాస్టల్లోని తన రూమ్కి వెళ్లింది. రాత్రి వరకు కూడా ఆమె నుంచి పలకరింపు లేదు..రాత్రి హాస్టల్ సిబ్బంది గమనించి గదిలోకి వెళ్లి చూడగా మంచం పై పడుకుని ఉంది..తీరా చూస్తే ఆత్మహత్య చేసుకుందని భావించి సిబ్బంది మార్కెట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గదిలో ఇంజెక్షన్ లభ్యమైనట్లు తెలుస్తోంది. ఇంజెక్షన్ ద్వారా విషం ఎక్కించుకుని ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.