రైతు డిస్కమ్పై తప్పుడు ప్రచారం చేయొద్దు

రైతు డిస్కమ్పై తప్పుడు ప్రచారం చేయొద్దు
  • ప్రభుత్వం చట్టప్రకారమే మూడో డిస్కమ్​ ఏర్పాటు చేస్తున్నది
  • ఈఆర్​సీ అనుమతి రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది
  • విధి విధానాలను బహిరంగంగా ప్రకటించిన ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: రైతు డిస్కమ్​పై తప్పుడు ప్రచారం చేయొద్దని ఆఫీసర్లు కోరారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్​ 2003 ద్వారా ప్రభుత్వం ఈ డిస్కమ్​ను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈఆర్​సీ నుంచి అనుమతి రావడానికి కొంత టైం పడుతుందని చెప్పారు. ధ్రువీకరించుకోకుండా తప్పుడు కథనాలను మెయిన్​ స్ట్రీమ్, సోషల్​మీడియాలో ప్రచారం చేయొద్దన్నారు. కొత్త డిస్కమ్​ ఏర్పాటు విధివిధానాలను శుక్రవారం ప్రకటించారు. 

కొత్త డిస్కమ్​ ఏర్పాటు జరిగేది ఇలా..

దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కమ్​) ఏర్పాటు చట్టబద్ధమైన, సాంకేతిక, పరిపాలనా, నియంత్రణ సంస్థల పర్యవేక్షణలో జరిగే ప్రక్రియ. డిస్కమ్​ ఏర్పాటులో మొత్తం 12 దశలు ఉంటాయి. ప్రభుత్వం ముందుగా కొత్త డిస్కమ్​ అవసరాన్ని గుర్తిస్తుంది. ప్రస్తుత విద్యుత్ సంస్థల పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకుంటుంది. వ్యవసాయ, ప్రాంతీయ పరిపాలనా అవసరాల ఆధారంగా కొత్త సంస్థ ఏర్పాటును పరిశీలిస్తుంది.

రెండో దశలో కంపెనీ నమోదు ప్రక్రియ చేపడుతుంది. డిస్కమ్​ను గవర్నమెంట్​ కంపెనీ, పబ్లిక్​ లిమిటెడ్​ కంపెనీ, స్పెషల్​ పర్పస్​ వెహికల్​(ఎస్​పీవీ)లలో ఏదో ఒక పేరుతో కంపెనీస్​ యాక్ట్​ ప్రకారం రిజిస్టర్​ చేస్తారు. ఈ దశలోనే మెమెరాండం ఆఫ్​ అసోసియేషన్​(ఎంవోఏ), ఆర్టికల్స్​ ఆఫ్​ అసోసియేషన్​(ఏవోఏ), బోర్డ్​ ఆఫ్​ డైరెక్టర్స్​ నియామకం, కార్పొరేట్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పూర్తి చేస్తారు. మూడో దశలో ఆస్తుల గుర్తింపు, విభజన చేపడుతారు.

రైతు డిస్కమ్​ కింద విద్యుత్​సబ్​ స్టేషన్స్, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్​ఫార్మర్లు, హెటీ, ఎల్టీ లైన్లు, భవనాలు, భూములు, వెహికల్స్, వినియోగదారుల సమాచారం వంటి వాటిని విభజిస్తారు. నాలుగో దశలో ఉద్యోగుల కేటాయింపు,  ఐదో దశలో ఆర్థిక పునర్వ్యవస్థీకరణ చేపడుతారు. కొత్తగా ఏర్పాటు చేసిన డిస్కమ్​ డిస్ట్రిబ్యూషన్​ లైసెన్స్​ రూల్స్​ 2005 ప్రకారం ‘ఓపెనింగ్​ బ్యాలెన్స్​ షీట్​, క్యాపిటల్​ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్​, దీర్ఘకాలిక నిర్వహణ సామర్థ్యం, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ ప్లాన్​ వంటివి’ తయారు చేస్తారు.

లైసెన్స్ కోసం ఈఆర్​సీకి అప్లై

ఆరో దశలో విద్యుత్​ పంపిణీ లైసెన్స్​ కోసం ఈఆర్​సీకి సెక్షన్లు12, 14, 15 ప్రకారం దరఖాస్తు చేస్తారు. ఏడు నుంచి తొమ్మిది దశల్లో ఈఆర్​సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి అర్హత ఉంటే లైసెన్స్​ మంజూరు చేస్తుంది. ముందుగా పబ్లిక్​ నోటీస్​ జారీ చేస్తుంది. ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తుంది. బహిరంగ మీటింగ్​లు నిర్వహిస్తుంది. తర్వాత ఈఆర్​సీ అధికారికంగా డిస్ట్రిబ్యూషన్​ లైసెన్స్​ జారీ చేస్తుంది. లైసెన్స్​ వచ్చాకే డిస్కమ్​ అధికారికంగా పనులు చేయడానికి వీలవుతుంది.

పదో దశలో మౌలిక వసతుల సమీకరణ చేపడుతారు. డిస్ట్రిబ్యూషన్​ నెట్​వర్స్​, స్కాడా, బిల్లింగ్​ సిస్టమ్స్, వినియోగదారుల సర్వీస్​ సెంటర్లు, ఫిర్యాదుదారుల కేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తారు. పదకొండో దశలో పాత సంస్థల నుంచి వినియోగదారుల బదిలీ ప్రక్రియ చేపడుతారు. సర్వీస్​ కనెక్షన్లు, బిల్లింగ్​ డేటా, మీటరింగ్​ రికార్డ్స్​, టారిఫ్​ కెటగిరీలు వంటి వాటిని కొత్త డిస్కమ్​లోకి బదిలీ చేస్తారు.

పన్నెండో దశలో డిస్కమ్​ నియంత్రణ, టారిఫ్​ ప్రక్రియ చేపడుతారు. ఏఆర్ఆర్​ ఫైలింగ్, టారిఫ్​ పిటీషన్స్​ స్వీకరణ, రెన్యూవెబుల్​ పర్చేస్​ ఆబ్లగేషన్లు (ఆర్​పీవో), స్టాండర్డ్​ ఫర్మార్మెన్స్​ వంటి వాటిని అమలు చేస్తారని రైతు డిస్కమ్​ ఆఫీసర్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే రైతు డిస్కమ్​కు సంబంధించి ఆరో దశ ప్రక్రియ జరుగుతున్నదని పేర్కొన్నారు.