కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో దారుణం జరిగింది. నెల రోజుల పసిపాపను ఆ పాప అమ్మమ్మ కనకమ్మ అనే వృద్ధురాలు రూ.1లక్షా 10వేలకు అమ్మేసింది. ఈ విషయాన్ని వృద్ధురాలి భర్తే డయల్ 100కి ఫోన్ చేసి చెప్పడంతో విషయం బయట పడింది.
వీణవంక మండల కేంద్రానికి చెందిన కనకమ్మ కూతురు పద్మకు రమేష్ అనే వ్యక్తితో రెండవ వివాహం జరిగింది . ఆ దంపతులు హైదరాబాద్లో నివాసముంటున్నారు. నెలరోజుల క్రితం వీణవంకలో పద్మ ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన కూతురును తల్లి వద్ద వదిలేసి పద్మ తిరిగి హైదరాబాద్ వెళ్లింది. గతంలో మొదటి వివాహం ద్వారా పద్మ కు ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో.. ఆ పసికందును నాలుగు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపులకు చెందిన రేవెల్లి సంపత్ దంపతులకు రూ.1లక్షా 10వేలకు కనకమ్మ అమ్మింది. ఆ డబ్బులతో అప్పులు తీర్చింది. ఈ విషయాన్ని కనకమ్మ భర్త యాదగిరి డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వివరాలు తెలుసుకొని చిన్నారిని స్వాధీనం చేసుకొని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కనకమ్మను, ఆమెకు సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.