యాదాద్రి, వెలుగు : ఎనిమిదేండ్లలో తెలంగాణ ప్రజలకు ఏం రాకున్నా.. సీఎం కేసీఆర్కు మాత్రం విమానం వచ్చిందని భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గంధమల్ల రిజర్వాయర్కు, ఎంఎంటీఎస్కు ఇవ్వడానికి పైసలు లేవు కానీ విమానం కొనుక్కోవడానికి మాత్రం ఖర్చు చేస్తున్నారన్నారు. దసరాకు అందరూ ఆయుధ పూజ చేస్తే కేసీఆర్ విమానపూజ చేసుకుంటారని ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా అలేరు, భువనగిరిలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని, మహాత్మునికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజల అన్ని సమస్యలు పరిష్కరించి జాతీయ పార్టీ కాదు.. అంతర్జాతీయ పార్టీ పెట్టుకున్నా తమకేం అభ్యంతరం లేదన్నారు. టీఆర్ఎస్కు రూ. 900 కోట్ల ఫండ్వచ్చిందని, అందులో ఆ పార్టీ ఎమ్మెల్యేల వాటా కూడా ఉందన్నారు. వీఆర్ఏలు అంటే కేసీఆర్కు చులకనగా ఉందన్నారు. వినతిపత్రం ఇస్తే విసిరికొడ్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ 30 మంది సూసైడ్ చేసుకున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలకు ఇండ్లు కట్టించడానికి లేవు గానీ 33 జిల్లాల్లో మాత్రం పార్టీ ఆఫీసులు కట్టించుకున్నారని విమర్శించారు.