దసరాకు అందరూ ఆయుధ పూజ చేస్తే కేసీఆర్​ విమానపూజ  చేసుకుంటారు

దసరాకు అందరూ ఆయుధ పూజ చేస్తే కేసీఆర్​ విమానపూజ  చేసుకుంటారు

యాదాద్రి, వెలుగు : ఎనిమిదేండ్లలో తెలంగాణ ప్రజలకు ఏం రాకున్నా.. సీఎం కేసీఆర్​కు మాత్రం విమానం వచ్చిందని భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి  అన్నారు. గంధమల్ల రిజర్వాయర్​కు, ఎంఎంటీఎస్​కు ఇవ్వడానికి పైసలు లేవు కానీ విమానం కొనుక్కోవడానికి మాత్రం ఖర్చు చేస్తున్నారన్నారు. దసరాకు అందరూ ఆయుధ పూజ చేస్తే కేసీఆర్​ విమానపూజ  చేసుకుంటారని ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా అలేరు, భువనగిరిలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని, మహాత్మునికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ప్రజల అన్ని సమస్యలు పరిష్కరించి జాతీయ పార్టీ కాదు.. అంతర్జాతీయ పార్టీ పెట్టుకున్నా తమకేం అభ్యంతరం లేదన్నారు. టీఆర్​ఎస్​కు రూ. 900 కోట్ల ఫండ్​వచ్చిందని, అందులో ఆ పార్టీ ఎమ్మెల్యేల వాటా కూడా ఉందన్నారు. వీఆర్​ఏలు అంటే కేసీఆర్​కు చులకనగా ఉందన్నారు. వినతిపత్రం ఇస్తే విసిరికొడ్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ 30 మంది సూసైడ్​ చేసుకున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలకు ఇండ్లు కట్టించడానికి లేవు గానీ 33 జిల్లాల్లో మాత్రం పార్టీ ఆఫీసులు కట్టించుకున్నారని విమర్శించారు.