
- 9 మందికి గాయాలు.. నలుగురికి సీరియస్
- సిద్దిపేట జిల్లాలో ప్రమాదం
సిద్దిపేట, వెలుగు: పెండ్లి చూపులకు వెళ్తుండగా, వెహికల్ బోల్తాపడి సిద్దిపేట జిల్లాలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. 9 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని బాలాజీనగర్ కు చెందిన మిరియాల శ్రీనివాస్(60) తన కూతురి పెండ్లి సంబంధం కోసం గురువారం ఉదయం 10 మంది బంధువులను తీసుకుని, టాటా ఏస్వెహికల్లో కరీంనగర్బయలుదేరాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వెహికల్ టైర్పేలి అదుపుతప్పింది. డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో శ్రీనివాస్(60), అతని కొడుకు హనుమంతరావు(26) అక్కడికక్కడే చనిపోయారు. బంధువులు విజయ, రమేశ్, జ్యోతి, వీరభద్రం, పావని, బాబు, లక్ష్మయ్య, సరిత, సాయికిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో విజయ, రమేశ్, జ్యోతి, పావని పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. చిన్నకోడూరు ఎస్సై సుభాష్ కేసు ఫైల్చేసి దర్యాప్తు చేస్తున్నారు.