కోల్కతా: గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించిన స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీ ఎంట్రీకి రెడీ అయ్యాడు. స్వదేశంలో వెస్టిండీస్తో జరిగే టీ20, వన్డే జట్లలో అతను చోటు దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్పై టీ20 అరంగేట్రం చేసిన యువ ఆల్రౌండర్ శివమ్ దూబేకు వన్డే జట్టు నుంచి కూడా పిలుపొచ్చింది. అన్ని ఫార్మాట్లలో తీరికలేకుండా ఆడుతున్న రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వకుండా.. ఫామ్ కోల్పోయిన శిఖర్ ధవన్పై వేటు వేయకుండా విండీస్తో లిమిటెడ్ ఓవర్ల సిరీస్లకు ఆలిండియా సెలెక్షన్ కమిటీ గురువారం ఫుల్ స్ట్రెంత్తో కూడిన ఇండియా టీమ్స్ను ప్రకటించింది. బంగ్లాతో టీ20లకు దూరంగా ఉన్న కోహ్లీ తిరిగి రావడంతో సంజూ శాంసన్ టీమ్కు దూరమయ్యాడు.
రిషబ్ పంత్నే రెండు జట్లకు కీపర్గా సెలెక్టర్లు మరోసారి సెలెక్ట్ చేశారు. ఇక, మహమ్మద్ షమీ, చైనామన్ కుల్దీప్ యాదవ్ను రెండు జట్లలోకి తీసుకున్న సెలెక్టర్లు.. సీనియర్ బ్యాట్స్మన్ కేదార్ జాదవ్ను వన్డేలకు ఎంపిక చేశారు. అదే సమయంలో లోకేశ్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్లకు రెండు జట్లలో చాన్సిచ్చారు. బంగ్లాతో మూడో టీ20లో వరల్డ్ రికార్డు బౌలింగ్తో అదరగొట్టిన దీపక్ చహర్ వన్డేలో జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు. క్రునాల్ పాండ్యాపై వేటు వేసిన సెలెక్టర్లు టీ20ల్లో వాషింగ్టన్ సుందర్ను కొనసాగించారు. వచ్చే నెల 6న ముంబైలో జరిగే తొలి 20తో ఈ సిరీస్ మొదలవనుంది. తిరువనంతపురం (8న), హైదరాబాద్ (11న) తర్వాతి రెండు టీ20లు జరుగుతాయి. ఆపై మూడు వన్డేల సిరీస్కు చెన్నై (15), విశాఖపట్నం (18), కటక్ (22) ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
రెండు జట్లకు ఎంపికైన ప్లేయర్లు: కోహ్లీ (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధవన్, లోకేశ్, అయ్యర్, మనీశ్ పాండే, పంత్ (కీపర్), దూబే, జడేజా, చహల్, కుల్దీప్, దీపక్, షమీ, భువనేశ్వర్. కేదార్ జాదవ్ (వన్డేలకు మాత్రమే), సుందర్ (టీ20లకు మాత్రమే).