వారంలో ప్రమోషన్​.. లంచం తీసుకుంటూ దొరికిన FRO

వారంలో ప్రమోషన్​.. లంచం తీసుకుంటూ దొరికిన FRO

 ₹4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎఫ్ఆర్​వో

వేములవాడ, వెలుగు: పై అధికారి ‘లంచం’ మాటున దాక్కున్నాడు. మహిళా అధికారిని ముందుపెట్టి తతంగం నడిపించాడు. వారంలో ప్రమోట్​ కావాల్సి న ఆమె ఉద్యోగ జీవితంపై అవినీతి మచ్చ పడింది. అదీ తన ఆఫీసులోనే పనిచేసే ఉద్యోగి వద్ద నుంచే డబ్బులు వసూలు చేస్తూ పట్టుబడిపోయింది. ఆమెతో పాటు పై అధికారికీ కేసుల మరక అంటింది. ఈ ఘటన గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల జిల్లా ఫారెస్ట్​ రేంజ్ ఆఫీస్​లో జరిగింది.

గొల్లపల్లి సెక్షన్​ ఆఫీసర్​ శ్రీనివాస్​ వద్ద నుంచి ₹4 లక్షలు లంచం తీసుకుంటున్న ఇన్​చార్జ్​ ఫారెస్ట్​ రేంజ్ ఆఫీసర్​ (FRO) అనితను ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​ గా పట్టుకున్నారు. ఈ లంచం తతంగానికి సూత్రధారి అయిన జిల్లా ఫారెస్ట్​ అధికారి శ్రీనివాస రావుపైనా అధికారులు కేసులు నమోదు చేశారు. సిరిసిల్ల రేంజ్ ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​గా పనిచేసిన శ్రీనివాస్​ ఇటీవలే గొల్లపల్లికి బదిలీ అయ్యారు. గతంలో సిరిసిల్లలో పనిచేసిన క్రమంలో వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ₹45 లక్షల విలువైన పనులు చేయించారు. దానికి సంబంధించిన బిల్లు తాజాగా విడుదలైంది. ఆ బిల్లును విడుదల చేసిన జిల్లా ఫారెస్ట్​ అధికారి శ్రీనివాస రావు.. అందులో 15 శాతం కావాలని ఎఫ్ఆర్​వో అనిత ద్వారా ఒత్తిడి చేయించాడు. 10 శాతం ఇచ్చేందుకు సెక్షన్​ ఆఫీసర్​ శ్రీనివాస్​ ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకూ వివరించాడు.  వారి స్కెచ్​లో భాగంగా గురువారం ఆఫీసులోనే ₹4 లక్షలు ఇచ్చేందుకు వెళ్లాడు. డబ్బులు తీసుకుంటున్న అనితను అధికారులు పట్టుకున్నారు. అరెస్ట్​ చేసి విచారణ చేస్తున్నారు.

6 నెలల క్రితం కరీంనగర్​ జిల్లాకు చెందిన ఇద్దరు సెక్షన్​ ఆఫీసర్లు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఈలోపే ఎఫ్ ఆర్​వో దొరికిపోవడం డిపార్ట్​మెంట్​లో కలకలం రేపుతోంది. ఎఫ్ఆర్​వో అనితకు వారంలో జిల్లా ఫారెస్ట్​ ఆఫీసర్​గా ప్రమోషన్​ రావాల్సి ఉంది. ఇప్పుడీ లంచం గొడవతో ప్రమోషన్​ కాదు కదా.. ఉద్యోగమే గందరగోళంలో పడే పరిస్థితులు ఏర్పడ్డాయి.