చందమామ పేరుతో ఆన్‌‌లైన్‌‌ మోసాలు..తక్కువ ధరకే డిజిటల్‌‌ పుస్తకాలంటూ ఆఫర్లు

చందమామ పేరుతో ఆన్‌‌లైన్‌‌ మోసాలు..తక్కువ ధరకే డిజిటల్‌‌ పుస్తకాలంటూ ఆఫర్లు

 

  • డబ్బులు కట్టాక స్పందన కరువు
  • ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఆన్‌‌లైన్‌‌లోనే ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు

యాదాద్రి, వెలుగు : ‘చందమామ ’ కథలు.. ఈ పేరు, పుస్తకాలు 20 ఏండ్ల కింద పుట్టిన వారందరికీ సుపరిచతమే. ఇంటర్‌‌నెట్‌‌, డిజిటల్‌‌ మీడియా పెరగడంతో ఈ పుస్తకాలకు ఇటీవల ఆదరణ తగ్గింది. అయితే ఈ పుస్తకాల పేరుతో సోషల్‌‌ మీడియా వేదికగా భారీ స్థాయిలో మోసాలు జరుగుతున్నాయి. చందమామ పుస్తకాలను తక్కువ ధరకే డిజిటల్‌‌ ఫార్మాట్‌‌లో పంపిస్తామంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

వీటిని చూసి నిజమేననుకొని చాలా మంది డబ్బులు కడుతున్నారు. అమౌంట్‌‌ కట్టి నెలలు గడుస్తున్నా డిజిటల్‌‌ ఫార్మాట్‌‌ బుక్స్‌‌ మాత్రం అందడం లేదు. సోషల్‌‌ మీడియాలో వచ్చిన యాడ్స్‌‌ను చూసి డబ్బులు పే చేసిన వారు ఇప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

తక్కువ ధరకే డిజిటల్‌‌ పుస్తకాలంటూ ప్రచారం

పిల్లల పుస్తక ప్రపంచంలో ‘చందమామ’ పత్రికకు ప్రత్యేక స్థానం ఉంది. 1947 జూలైలో ప్రారంభమైన చందమామ మాసపత్రికను తెలుగుతో పాటు దాదాపు అన్ని భాషల్లో వెలువడింది. ఇంటర్‌‌నెట్‌‌ వాడకం, డిజిటల్​మీడియా పెరగడంతో పుస్తకాలకు ఆదరణ తగ్గింది. చందమామ పుస్తకాల పట్ల ఇప్పటివారికి ఆసక్తి తగ్గకపోవడంతో కొందరు వ్యక్తులు సోషల్‌‌ మీడియా వేదికగా దందా మొదలు పెట్టారు.

1947 నుంచి 2012 వరకు వెలువడిన చందమామ పుస్తకాలను డిజిటల్‌‌ ఫార్మాట్‌‌లో అందిస్తామంటూ భారీ స్థాయిలో ప్రకటనలు పోస్ట్‌‌ చేస్తున్నారు. 745 సంచికలను రూ. 249కే ఇస్తామని, 740 సంచికలు రూ. 199కే పంపిస్తామంటూ సోషల్‌‌ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, ఇంగ్లిష్‌‌ సంచికలు సైతం పంపుతామంటూ ప్రకటిస్తున్నారు. ఇది చూసిన కొందరు వ్యక్తులు పుస్తకాల కోసం ప్రకటనల్లో కనిపించిన లింక్‌‌పై క్లిక్‌‌ చేయగానే మెయిల్‌‌, ఫోన్‌‌ నంబర్‌‌, పేరు, అడ్రస్‌‌ వంటి వివరాలు అడుగుతున్నారు.

నెలలు గడుస్తున్నా అందని డిజిటల్‌‌ పుస్తకాలు.

సోషల్‌‌ మీడియాలో కనిపించే ప్రకటనలను చూసిన చాలా మంది వివరాలన్నీ పూర్తి చేసి వారు అడిగిన విధంగా పేమెంట్లు సైతం పూర్తి చేశారు. డబ్బులు కట్టి నెలలు గడుస్తున్నా డిజిటల్‌‌ పుస్తకాలు అందడం లేదు. దీంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక అదే సోషల్‌‌ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని సంస్థలు ఓ వాట్సప్‌‌ నంబర్‌‌ ఇస్తూ ఓటీపీ వివరాలు సైతం అడుగుతున్నాయని, అన్ని వివరాలు పంపినా సరైన స్పందన మాత్రం రావడం లేదని డబ్బులు కట్టిన వారు 
వాపోతున్నారు.