డైరెక్ట్ సీడింగ్ వైపు వరి రైతులు..నాట్లు వేసే బదులు నేరుగా వరి సాగు

డైరెక్ట్ సీడింగ్ వైపు  వరి రైతులు..నాట్లు వేసే బదులు నేరుగా వరి సాగు
  • వెదజల్లే పద్ధతితో 15 శాతంపైగా  సాగవుతుందని అంచనా
  • తగ్గనున్న పెట్టుబడి ఖర్చు.. నీటి ఎద్దడిని తట్టుకోనున్న పైరు
  • చీడపీడలు తగ్గుతాయంటున్న  సైంటిస్టులు

హైదరాబాద్, వెలుగు: వరిసాగులో సంప్రదాయ నాట్ల పద్ధతికి స్వస్తి పలుకుతూ వెదజల్లే పద్ధతి (డైరెక్ట్ సీడింగ్) వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆధునిక పద్ధతి ద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాకుండా కూలీల కొరత సమస్యను అధిగమించి, ఆశించిన స్థాయిలో దిగుబడి సాధిస్తున్నారు. డైరెక్ట్  సీడింగ్  పద్ధతిలో పొడి పద్ధతి, తడి పద్దతిలో విత్తనాలు వేసి తరువాత నీళ్లు కట్టి డ్రై టు వెట్​ కన్వర్ట్​గా సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఈ వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 66 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగనుండగా, అందులో 12 నుంచి 15 శాతం వెదజల్లే పద్ధతి పాటిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, వరంగల్​  జిల్లాల్లో ఈ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. ఈయేడు రాష్ట్రంలో డైరెక్ట్  సీడింగ్  మరింత విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లో ఏటా 5 లక్షల ఎకరాలకు పైగా వెదజల్లే పద్ధతిలో వరి సాగు జరుగుతున్నదని అగ్రికల్చర్​ సైంటిస్టులు చెబుతున్నారు. క్రమంగా రాష్ట్రంలో కూడా ఆధునిక విధానంలో వరి సాగు విస్తరించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంప్రదాయ వరినాట్ల పద్ధతిలో ఎకరాకు రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు కూలీల ఖర్చు, ట్రాక్టర్​ కిరాయి, ఎరువులతో కలిపి మొత్తం రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. వెదజల్లే పద్ధతిలో ఎకరాకు కేవలం 8- నుంచి 10 కిలోల విత్తనాలతో సాగు సాధ్యమవుతుంది. పొడి పద్ధతిలో ఈ విధానంలో నారుమడులు, బురద పొలాలు, కరిగట్టు వంటి శ్రమతో కూడిన పనులు అవసరం లేకపోవడంతో ఎకరాకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదా అవుతున్నది. అంతేకాకుండా పంట 10 నుంచి -15 రోజుల ముందుగానే కోతకు వస్తుండటం రైతులకు అదనపు ప్రయోజనంగా నిలుస్తున్నది.

ప్రోత్సహిస్తున్న వ్యవసాయ శాఖ

వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికల ద్వారా వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడర్ , సీడ్రిల్​ పద్ధతులపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అగ్రికల్చర్  వర్సిటీ  ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు గ్రామీణ స్థాయిలో రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ‘‘డైరెక్ట్  సీడింగ్  పద్ధతితో ఖర్చులు తగ్గడమే కాకుండా, దిగుబడి అధికంగా వస్తుంది. వరి విత్తనాల్లో 40 శాతం ఆదా అవుతుంది. నారు పోసుకోవాల్సిన అవసరం లేక పోవడంతో టైమ్  కూడా కలిసి వస్తుంది. రైతులు ఈ ఆధునిక విధానాన్ని అవలంబించాలని క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం’’ అని వ్యవసాయ శాఖ అడిషనల్​  డైరెక్టర్  విజయ్  కుమార్  తెలిపారు.

వర్షాభావ పరిస్థితుల్లోనూ ఉత్పత్తి

వెదజల్లే పద్ధతిలో పొడి దుక్కిలో విత్తనాలు చాళ్లలో నేరుగా నాటుతారు. ఈ విధానం వర్షాభావ పరిస్థితుల్లో కూడా నీటి ఎద్దడిని తట్టుకొని మంచి దిగుబడి ఇస్తున్నది. సీడ్ కం ఫర్టిలైజర్  మెషీన్  ద్వారా విత్తనాలు, ఎరువులు ఒకేసారి వేయడం వల్ల కలుపు మొక్కల నివారణ సులభతరం కాగా, చీడపీడల సమస్య కూడా తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతితో ఎకరాకు 34 నుంచి 38 బస్తాల దిగుబడి సాధిస్తున్నామని రైతులు పేర్కొంటున్నారు. ‘‘ఈసారి నాలుగు ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తున్నా. సాధారణ నాట్ల కన్నా ఈ పద్ధతి సులభంగా ఉంది. ఎకరాకు రూ.8 వేల నుంచి రూ.10 వేల ఖర్చు తగ్గింది. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో ఉంది” అని మహబూబాబాద్​ జిల్లాకు చెందిన రైతు శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. కూలీల ఇబ్బందులు తొలగి సమయం ఆదా అవుతున్నదని ఇతర రైతులు కూడా హర్షం వ్యక్తం చేశారు.