ముంబై: భారత్, పాకిస్థాన్ సంబంధాల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ ప్రభావం ఇరు దేశాలు బాగా ఇష్టపడే క్రికెట్ మీదా పడింది. ఇండో పాక్ క్రికెట్ టీమ్లు సొంతగడ్డపై ఒకరితో మరొకరు పోటీ పటి చాలా ఏళ్లవుతోంది. ఐపీఎల్లో కూడా పాకిస్థాన్ ప్లేయర్లు ఆడట్లేదు. రాబోయే టీ20 వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్లేయర్లకు వీసాలు ఇస్తారో లేదనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ విషయంపై స్పష్టత వచ్చింది. అక్టోబర్లో జరిగే పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్లో ఆడే పాక్ ఆటగాళ్లకు వీసాలు మంజూరు అవుతాయని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ పేర్కొంది. ప్రభుత్వ హామీ ప్రకారం పాక్ క్రికెటర్లకు వీసాలు మంజూరు అవుతాయని బోర్డు సెక్రటరీ జైషా కౌన్సిల్లో చెప్పారని తెలిసింది.
‘పాకిస్థాన్ క్రికెట్ టీమ్కు వీసాల జారీ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. అయితే పాక్ ఫ్యాన్స్ ఇక్కడకు వచ్చి మ్యాచ్లను వీక్షించే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు’ అని అపెక్స్ కౌన్సిల్కు చెందిన ఓ మెంబర్ నేషనల్ మీడియాతో చెప్పారని సమాచారం. టీ20 కప్ నిర్వహణపై శుక్రవారం బోర్డు కౌన్సిల్ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఇందులో టీ20 ప్రపంచ కప్ వేదికలను ఖరారు చేశారు. తొమ్మిది వేదికల్లో టోర్నీని ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అహ్మదాబాద్లో కొత్తగా నిర్మించిన నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మిగిలిన మ్యాచ్లు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, ధర్మశాల, లక్నోలో నిర్వహించనున్నారు.