లక్నో: ఓ వైపు పుల్వామా దాడి నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నడుస్తోంది. ఈ సమయంలో పాక్ అధికార పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) ఎంపీ భారత్ కు వచ్చారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కుంభ మేళాలో పాల్గొని పవిత్ర స్నానం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
2018లో పాక్ లోని మైనారిటీ (హిందూ) స్థానం నుంచి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ తరఫున పోటీ చేసి రమేశ్ కుమార్ వంక్వానీ గెలుపొందారు. ఆయన ఇవాళ ఉదయం ప్రయాగ్ రాజ్ వచ్చి కుంభ మేళాలో పాల్గొన్నారు. ప్రవిత్ర స్నానమాచరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. భారత ప్రభుత్వ ఆహ్వానంతో తాను కుంభ మేళాకు వచ్చానని చెప్పారు. గతంలోనూ కుంభమేళాకు వచ్చానన్నారు. ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్న తీరుకు భారత ప్రభుత్వానికి అభినందనలు చెప్పారాయన. ఎంతో క్రమశిక్షణతో ఈ మహా ఆధ్యాత్మిక సమ్మేళనం జరగడం బాగుందని ప్రశంసించారు.
ప్రధాని మోడీని కలుస్తా
తాను ప్రధాని మోడీని, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలుస్తానని చెప్పారు రమేశ్. ఇరు దేశాల మధ్య శాంతి సామరస్యాల కోసం విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. పాక్ ప్రభుత్వంతో కూడా దీనిపై మాట్లాడానని, వారు కూడా శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటున్నారని అన్నారు. పుల్వామా దాడి నేపథ్యంలో పాక్ ఎంపీ రమేశ్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.