పాల డబ్బాలో పురుగుల మందు కలిపి.. సొంత బిడ్డలనే చంపిన తల్లిదండ్రులు?

పాల డబ్బాలో పురుగుల మందు కలిపి.. సొంత బిడ్డలనే చంపిన తల్లిదండ్రులు?

మహబూబాబాద్​, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులే పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి చంపేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి. గార్ల ఎస్సై బి.వెంకన్న కథనం ప్రకారం.. పెండకట్ల అనిల్, దేవి దంపతులు. ఊరిలో కిరాణ షాపు నడుపుకుంటున్నారు. వీరికి  లోహిత(3), జశ్విత(11నెలలు) అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంటి ముందు అనిల్ ​తండ్రి వెంకన్న పడుకున్నాడు. ఇంట్లో అనిల్, దేవి, పిల్లలు నిద్రపోయారు. ఆదివారం తెల్లారినా అలికిడి లేకపోవడంతో పిల్లల తాత వెంకన్న ఇంటి తలుపు తీసి లోపలకు వెళ్లాడు. 

అక్కడ ఇద్దరు పిల్లలు నురుగులు కక్కుకుని చనిపోయి ఉన్నారు. సమీపంలోనే పురుగుల మందు డబ్బా, సగం తాగిన పాల బాటిల్ ​ఉంది. కొడుకు, కోడలిని పిలిచినా రాలేదు. వారి గురించి వెతికినా జాడ దొరకలేదు. ఇంటి ఆవరణలో బైక్​ లేదు. పిల్లల తల్లిదండ్రులే పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని మహబూబాబాద్​ డీఎస్పీ తిరుపతి రావు పరిశీలించారు.