- పోషించే స్తోమత లేకే అంటున్న తల్లిదండ్రులు
- నిజామాబాద్ జిల్లా ఘన్పూర్లో ఘటన
డిచ్పల్లి, వెలుగు: నవమాసాలు కడుపున మోసినా.. పోషించే స్థోమత లేక పుట్టిన గంటలలోపే రూ. 2,500కు కొడుకును తల్లిదండ్రులు అమ్ముకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామంలో జరిగింది. ఘన్పూర్లోని మహాలక్ష్మి ఆలయ పరిసరాల్లో కొంత కాలంగా మెదక్ జిల్లాకు చెందిన దంపతులు భీమవ్వ, కొమురయ్య గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. గ్రామంలోని కల్లుబట్టిలో కొమురయ్యకు వారం కింద మండలంలోని ధర్మారం (బి) గ్రామానికి చెందిన లక్ష్మణ్ తో పరిచయం ఏర్పడింది. లక్ష్మణ్ తనకు పిల్లలు లేరని చెప్పడంతో కొమురయ్య తన భార్యకు కొన్ని రోజుల్లో డెలివరీ అవుతుందని, తమ బిడ్డను తీసుకొమ్మని చెప్పాడు. శనివారం భీమవ్వ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డను లక్ష్మణ్కు రూ. 2,500కు అమ్మేశారు. విషయం తెలుసుకున్న డిచ్పల్లి పోలీసులు శిశువును, తల్లిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిశువును కొన్న లక్ష్మణ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గణేశ్ చెప్పారు.