కరాచీ: పాకిస్తాన్లో 2024 ఫిబ్రవరి 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అవకతవకలకు నిరసనగా ప్రతిపక్ష కూటమి షట్ డౌన్కు పిలుపునిచ్చింది. దీంతో బలూచిస్తాన్లోని పలు ప్రాంతాలు స్తంభించిపోయాయి. బంద్ పిలుపుతో బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా, ఇతర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. ప్రజా రవాణా నిలిచిపోయింది. క్వెట్టాలోని ప్రధాన రహదారులను ఆందోళనకారులు నిర్భందించడంతో ప్రభుత్వం భారీగా పోలీసులను మొహరించింది.
పలువురు నిరసనకారులను అరెస్ట్ చేశారు. గత ఎన్నికల్లో అవకతవకలపై ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) సహా అన్ని ప్రతిపక్ష పార్టీల ఐక్య ఫ్రంట్ అయిన తెహ్రీక్ ఈ తహాఫుజిఆయిన్ పాకిస్తాన్ (టీటీఏపీ) సమ్మెకు పిలుపునిచ్చింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)లను దేశ దొంగలని అభివర్ణించింది. వారు అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి, ఫలితాలను తారుమారు చేశారని ప్రతిపక్ష కూటమి సభ్యులు ఆరోపించారు.
