జనాభాను బట్టి డివిజన్లు ఏర్పాటుచేయాలి : గద్వాల విజయలక్ష్మి

జనాభాను బట్టి డివిజన్లు ఏర్పాటుచేయాలి : గద్వాల విజయలక్ష్మి
  •     మేయర్​ విజయలక్ష్మి, కమిషనర్​ను కోరిన కార్పొరేటర్​ కుమార్​యాదవ్

అమీన్​పూర్, వెలుగు: పటాన్​చెరు, అమీన్​పూర్, తెల్లాపూర్, జీహెచ్​ఎంసీ వార్డులను పునర్విభజన చేయాలని పటాన్​చెరు కార్పొరేటర్​ మెట్టు  కుమార్​యాదవ్​ నగర మేయర్​ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్​ ఆర్​వీ కర్ణన్​ను కోరారు. 

మంగళవారం మేయర్​ అధ్యక్షతన జరిగిన 27 యూఎల్బీల విలీనం, మున్సిపల్​ కార్పొరేషన్​ వార్డుల విభజన, వార్డుల పునర్విభజన ప్రక్రియ అభ్యంతరాలపై నిర్వహించిన సమావేశంలో కుమార్​ యాదవ్​ పలు అంశాలను ప్రస్తావించారు. అమీన్​పూర్​ పట్టణ పరిధిలో లక్షా 25వేల జనాభా ఉండగా అమీన్​పూర్​, సుల్తాన్​పూర్​ పేరుతో రెండు డివిజన్లు మాత్రమే చేశారని, జనాభా ప్రాతిపాదికన డివిజన్ల సంఖ్య పెంచాలన్నారు. 

తెల్లాపూర్​లో  కేసీఆర్​ నిర్మించిన డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లల్లో లక్ష పైచిలుకు ఓటర్లు ఉన్నారని, ఇక్కడ తెల్లాపూర్​, ముత్తంగి పేరుతో రెండు డివిజన్లు మాత్రమే చేశారని, దీని వల్ల పరిపాలన ఇబ్బందిగా మారుతుందన్నారు.  పటాన్​చెరులో  జేపీ కాలనీకి బదులుగా బండ్లగూడ డివిజన్​ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నట్లు సమావేశంలో వివరించారు.  బొల్లారం డివిజన్​ను కూకట్​పల్లి జోన్​లో కాకుండా శేరిలింగంపల్లి జోన్​లో కలపాలని కోరారు. 

 నాలుగు డివిజన్​లు ఏర్పాటు చేయండి

పరిపాలన సౌలభ్యం కోసం అమీన్​పూర్​ను నాలుగు జీహెచ్​ఎంసీ డివిజన్​లుగా ఏర్పాటు చేయాలని అమీన్​పూర్​ పట్టణ కాంగ్రెస్​ నాయకులు జీహెచ్​ఎంసీ కమిషనర్​ ఆర్​వీ కర్ణన్​ను కోరారు. జీహెచ్​ఎంసీ కమిషనర్​ ఆఫీసులో, అమీన్​పూర్​ డిప్యూటీ కమిషనర్​ఆఫీసులో పట్టణ కాంగ్రెస్​ అధ్యక్షుడు శశిధర్​రెడ్డి కాంగ్రెస్​ నాయకులతో వినతిపత్రాలను అందజేశారు. 

అమీన్​పూర్​లో దాదాపు లక్షా ఇరవై వేల జనాభా ఉందని, రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందన్నారు. బీరంగూడ ఆలయ చైర్మన్​ సుధాకర్​యాదవ్, నాయకులు మున్నా, మహేశ్, నవీన్, రవీందర్, సత్తన్న, చంద్రశేఖర్, మహేశ్​గౌడ్, నరేశ్​యాదవ్, మల్లేశ్​యాదవ్, దీపక్​గౌడ్, రాజు, శ్రీనివాస్, ప్రకాశ్, రాఘవ్, వల్లభ పాల్గొన్నారు.