చంద్రబాబుకు అండ అనే భ్రమలో పవన్ తన ఉనికి కోల్పోతున్నాడా..?

చంద్రబాబుకు అండ అనే భ్రమలో పవన్ తన ఉనికి కోల్పోతున్నాడా..?

2014ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అన్న నినాదంతో పార్టీ స్థాపించి ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రశ్నించటం కోసం పార్టీ పెట్టానన్న పవన్ తన మద్దతుతో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రేక్షక పాత్ర వహించాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తాను గెలవాలన్న టార్గెట్ కంటే జగన్ ను ఎట్టి పరిస్థితిలో గెలవనివ్వకూడదు అన్న ఆలోచనతో బరిలో దిగి ఘోరంగా ఓడిపోయాడు.

2019 ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమిలో చేరి ప్రస్తుతం 2024 ఎన్నికల కోసం టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిర్చే బాధ్యత భుజాన వేసుకున్నాడు. ఈ క్రమంలో జనసేనను టీడీపీ బి టీమ్ గా మార్చేస్తున్నారు పవన్. పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా కూడా ఎన్నికల కోసం సొంతంగా రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోలేని పరిస్థితిలో ఉంది జనసేన. అయితే బీజేపీ, లేకుంటే టీడీపీ చూపిన దారిలో నడవటమే జనసైనికుల వంతు అవుతోంది తప్ప సొంత ఎజెండా అంటూ లేకుండా పోయింది.

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఏపీలో ఏర్పడ్డ పొలిటికల్ వ్యాక్యూమ్ ని తనకు అనుకూలంగా వాడుకోవాల్సింది పోయి తానే స్వయంగా టీడీపీతో పొత్తు ప్రకటించటం పవన్  స్వయంకృతాపరాధం. టీడీపీకి అభయహస్తం ఇస్తున్నానన్న భ్రమలో రాకరాక వచ్చిన గోల్డెన్ ఛాన్స్ వదులుకున్నాడు పవన్. ఒకవేళ పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు తెలపకుండా ఈ ఎన్నికల్లో బీజేపీతో మాత్రమే కలిసి వెళ్లుంటే, 2024లో జరిగే త్రిముఖ పోరులో ఏ పక్షానికి మెజారిటీ రాకపోయి ఉంటే జనసేన కింగ్ మేకర్ గా నిలవటం ఖాయమై ఉండేది. ఇప్పుడున్నట్టు పోటీ చేయబోయే స్థానాలు కూడా టీడీపీ డిసైడ్ చేసే దుస్థితి ఉండేది కాదు. 

Also Read : ఆర్కే మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది