టీసీఎస్, ఇన్ఫోసిస్ ల తరహాలో కొత్త దిగ్గజాలు
యూనికార్న్గా ఫోన్ పే
మరింత మంది ఎంట్రప్రెన్యూర్ల రాకకు ఊపు
వెలుగు బిజినెస్ డెస్క్ : ఇండియాలో ఏడాదిన్నర కిందట 1,48,614 కోట్ల(20.8 బిలియన్ డాలర్ల) విలువైన ఒకే ఒక్క యూనికార్న్ ఉండగా, నేడు 2,14,348 కోట్ల (30 బిలియన్ డాలర్లు) విలువైన రెండు యూనికార్న్లు ఉన్నాయి. యూనికార్న్ అంటే బిలియన్ డాలర్లకు పైన విలువ కలిగి ఉండటం.ఇండియాలో కొత్త తరపు టెక్నాలజీ దిగ్గజాలు అవతరిస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోల తర్వాత రెండు దశాబ్దాలపాటు ఈ రంగంలో దిగ్గజాలు రాని లోటు ఇప్పుడు తీరుతోంది. ఇండియాలోనే ఇప్పటిదాకా అతి పెద్ద స్టార్టప్గా పేరొందిన ఒక కంపెనీ ఇప్పుడు ఒక యూనికార్న్ పుట్టుకకు కారణమవుతుండటం విశేషం. ఇలాంటివి చాలా అరుదు. అది ఇండియాలోనే జరుగుతోంది. దీంతో మళ్లీ టెక్నాలజీ రంగంలో ఇండియా ధీటుగా నిలబడే రోజులు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్త అమెరికా కంపెనీ వాల్మార్ట్కు కూడా గుడ్న్యూసే. ఎందుకంటే ఈ కంపెనీయే ఇండియా ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ను 16 బిలియన్ డాలర్లు చెల్లించి, మరీ సొంతం చేసుకుంది. ఫ్లిప్కార్ట్లో 77 శాతం వాటాను గత ఏడాది మే లో వాల్మార్ట్ చేజిక్కించుకుంది. ఈ డీల్లో భాగంగా ఫ్లిప్కార్ట్ కిందున్న ఫోన్ పే కూడా వాల్మార్ట్ చేతికి మారింది. డిజిటల్ వాలెట్ బిజినెస్లో పేటీఎం లాగే ఫోన్ పే కూడా ముందుగానే అడుగుపెట్టింది. అమ్ముడుపోవడానికి రెండేళ్ల ముందే ఫ్లిప్కార్ట్ ఈ ఫోన్ పే ను కొనేసింది.
10 బిలియన్ డాలర్లకు ఫోన్ పే…
ఫోన్ పే ను ప్రత్యేక కంపెనీగా మార్చాలని ఇప్పుడు వాల్మార్ట్ ప్రయత్నిస్తోంది. ఫోన్ పే కోసం బిలియన్ డాలర్ల నిధులు సేకరించాలని యోచిస్తోంది. దీంతో ఫోన్ పే విలువ అమాంతం 10 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఫోన్ పే లో 82 శాతం వాటాతో వాల్మార్ట్ అతి పెద్ద వాటాదారు. దీంతో ఏడాదిన్నర కిందట 20.8 బిలియన్ డాలర్ల విలువతో ఇండియాలో ఉన్న ఒకే ఒక్క యూనికార్న్ ఇప్పుడు 30 బిలియన్ డాలర్ల విలువతో రెండు యూనికార్న్లు అవుతున్నాయి. ఫ్లిప్కార్ట్ ట్రైనింగ్ వీల్స్ నుంచి బైటపడాలనే ఫోన్ పే ప్రయత్నాలు సక్సెసయ్యే సూచనలు కనబడుతున్నాయి. మూడేళ్ల కిందట ఫోన్ పే ట్రాన్సాక్షన్స్లో సగం ఫ్లిప్కార్ట్వే ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఫోన్ పే ట్రాన్సాక్షన్స్లో ఫ్లిప్కార్ట్ వాటా కేవలం 0.5 శాతానికి పరిమితమవుతోందని మీడియా సంస్థ కెన్ రిపోర్ట్ చేసింది. ఫోన్ పే స్ట్రేటజీ, ప్లానింగ్ హెడ్ ఈ వివరాలు వెల్లడించినట్లు పేర్కొంది. కిందటి నెలలోని ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫోన్ పే లోగా టాప్ బిల్లింగ్లో ఎక్కడా ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో కనబడకపోవడం గమనార్హమని కూడా కెన్ పేర్కొంది. ఆన్లైన్ షాపర్లకు ఉన్న పేమెంట్ ఆప్షన్స్లో ఒకటి మాత్రమే ఫోన్ పే ను ఉంచారు.
స్వతంత్ర సంస్థగా ఫోన్ పే…
ఫోన్ పే స్వతంత్రంగా అవతరించడమంటే ఇండియాలో డిజిటల్ సెక్టర్ మెచ్యూర్ అవుతున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచపు టెక్నాలజీ దిగ్గజం ఆల్ఫాబెట్ ఇంక్ నాయకత్వంలోని గుగుల్ పే తోపాటు, త్వరలో రంగంలోకి రానున్న ఫేస్బుక్ కంపెనీ వాట్సప్ పేమెంట్స్తో ముఖాముఖీ తలపడటానికి ఫోన్ పే సిద్ధమవుతోంది. తన మనుగడ కోసం ఫోన్ పే ఇప్పటికీ భారీగా ఖర్చు పెడుతుండటమే కాకుండా, నష్టాలలోనే కొనసాగుతోంది. ఐతే, ఫ్లిప్కార్ట్ (ఇప్పుడు వాల్మార్ట్) వంటి దిగ్గజాల నుంచి పుష్కలంగా నిధులు దొరకడంతో ఇబ్బందులను ఫోన్ పే అధిగమించగలుగుతోంది.
పేటీఎం వాల్యుయేషన్ 16 బిలియన్ డాలర్లకు చేరిక….
ఇంకొంచెం విస్తారంగా ఆలోచిస్తే, ఫోన్ పే స్వతంత్రంగా అవతరిస్తున్న ఈ తరుణంలో, దేశీయ పేమెంట్ దిగ్గజం పేటీఎం యాంట్ ఫైనాన్షియల్, సాఫ్ట్బ్యాంక్ సహా ఇతర ఇన్వెస్టర్ల నుంచి రెండు బిలియన్ డాలర్లు సేకరించుకునే పనిలో బిజీగా ఉంది. తాజా రౌండ్ నిధుల సేకరణతో పేటీఎం వాల్యుయేషన్ కూడా పదహారు బిలియన్ డాలర్లకు చేరనుందని బ్లూమ్బర్గ్ కిందటి వారంలో రిపోర్ట్ చేసింది.
ఫోన్ పే, పేటీఎం ల సక్సెస్ ఇండియాలో మరింత మంది ఎంట్రప్రెన్యూర్ల రాకకు ఊపు ఇస్తుందని ఆశిస్తున్నారు. ఐటీ అవుట్సోర్సింగ్ బూమ్ తర్వాత మన దగ్గర టెక్నాలజీ రంగంలో దిగ్గజాలు ఏవీ రాకపోవడంతో ఆ లోటు ఇప్పుడు తీరి, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోల తరహాలో కొత్త దిగ్గజాలు అవతరిస్తాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
సిటీలోనూ దూసుకెళ్తున్నాం
హైదరాబాద్ ని 4 లక్షల ఆఫ్ లైన్ మర్చంట్ అవుట్ లెట్లకు పేమెంట్ ఆప్షన్ అవతరించినట్లు ఫోన్ పే వెల్లడించింది. ముఖ్యంగా నగరంలోని
చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులందరూ ఫోన్ పేను యాక్సెప్ట్ చేస్తున్నారని తెలిపింది. గత ఏడాది కాలంలో హైదరాబాద్ సాధించిన వృద్ధి
అద్వితీయమని ఈ సందర్భంగా ఆఫ్ లైన్ బిజినెస్ హెడ్ యువ్ రాజ్ సింగ్ పేర్కొన్నారు. 15 కోట్ల మంది యూజర్లను అందుకున్న ఫోన్ పే ఇండి యాలోని 210 నగరాలలో తన సేవలందిస్తోంది.