హైదరాబాద్, వెలుగు: త్వరలో జరిగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తనకు అవకాశం ఇవ్వాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ కాంగ్రెస్ హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కు లేఖలు రాశారు.
గత పదేళ్లుగా ఓయూ విద్యార్థి నేతగా నిరుద్యోగుల తరపున పోరాటం చేశానని, తెలంగాణ జెన్ జీల తరపున మండలిలో పోరాడుతానని పేర్కొన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. జెన్ జీలను చట్టసభల్లోకి పంపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి 25 ఏళ్ల వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని నిర్ణయించినందున విద్యార్థి నేతగా తనకు అవకాశం కల్పించాలని కోరారు.
