సగటు మనిషి పొట్టగొట్టిన లాక్ డౌన్.. తిండి రెండు పూటలే

సగటు మనిషి పొట్టగొట్టిన లాక్ డౌన్.. తిండి రెండు పూటలే

న్యూఢిల్లీసగటు మనిషిపై కరోనా దెబ్బ మామూలుగా పడలేదు. పొట్టగొట్టడమే కాదు.. శారీరకంగా, మానసికంగా మహమ్మారి కొట్టిన దెబ్బకు ఇప్పటికీ చాలా కుటుంబాలు యాతన పడుతున్నాయి. కరోనా లాక్​డౌన్​ టైంలో ఎందరో కూలీలు పని దొరక్క సొంతూళ్లకు వెళ్లిపోయారు. మామూలు వేతన జీవిపైనా ప్రభావం పడింది.

దీంతో చాలా కుటుంబాలు సగం కడపులే నింపుకుని కాలం వెళ్లదీశాయి. 55 శాతం కుటుంబాలు రోజు రెండు పూటలే తిండి తిని బతుకీడ్చాయి. 24 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్​ 1 నుంచి మే 15 వరకు చిన్నపిల్లల హక్కుల సంస్థ ‘వరల్డ్​ విజన్​ ఆసియా పసిఫిక్​’ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. ఆ సర్వే రిపోర్టును ‘కరోనా ఎఫెక్ట్​ ఆన్​ ఆసియా మోస్ట్​ వల్నరబుల్​ చిల్డ్రెన్​ ఎర్లీ రికవరీ అసెస్​మెంట్​’ పేరిట ఆదివారం విడుదల చేసింది. 67 శాతం మంది ఉపాధిని కరోనా దెబ్బతీసిందని ఆ రిపోర్ట్​లో పేర్కొంది. అంతేగాకుండా పిల్లల మంచిచెడులపైనా ప్రభావం చూపించిందని చెప్పింది. తిండి, పోషకాహారం, ఆరోగ్యం, మందులు, స్వచ్ఛత వంటి విషయాల్లో పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపింది. కరోనా లాక్​డౌన్​ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంది. ఈ ఎఫెక్ట్​ ఎక్కువగా రోజువారీ కూలీలపైనే పడిందని చెప్పింది. సరైన సదుపాయాలు లేక, ఆదాయం రాక నిత్యావసరాలు కొనలేకపోయారని పేర్కొంది. 56 శాతం మందికే నీళ్లు, శానిటేషన్​ వంటి అవసరాలు తీరాయని తెలిపింది.

పిల్లలపై ఒత్తిడి

లాక్​డౌన్​ ఎఫెక్ట్​ ఎక్కువగా మహిళలు, పిల్లలపైనే పడిందని రిపోర్ట్​ పేర్కొంది. లాక్​డౌన్​తో స్కూళ్లు మూతపడడం, పిల్లలు ఇళ్లలోనే ఉండిపోవడం వల్ల వాళ్ల వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పింది. క్వారంటైన్​ వంటి చర్యలతో పిల్లలపై ఒత్తిడి పడిందని, దాంతో శారీరక, మానసిక హింసకు వాళ్లు గురయ్యారని తెలిపింది. కాగా, ఇండియాతో పాటు బంగ్లాదేశ్​, కంబోడియా, ఇండోనేసియా, మంగోలియా, మయన్మార్​, నేపాల్​, ఫిలిప్పీన్స్​, శ్రీలంక వంటి దేశాల్లోనూ సంస్థ సర్వే చేసింది. పౌష్టికాహారం, నగదు బదిలీ, వోచర్​ అసిస్టెన్స్​ కోసం సోషల్​ ప్రొటెక్షన్​ చర్యలు తీసుకోవాల్సిందిగా రిపోర్ట్​ సూచించింది. పబ్లిక్​ వర్క్​ ప్రోగ్రామ్​లలో ఇన్వెస్ట్​మెంట్లను పెంచాలని పేర్కొంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది.