కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలె

హైదరాబాద్ :  ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో కరోనా పరిస్తితి వైద్యారోగ్యశాఖ అప్రమత్తతపై ఆదివారం  ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.... కరోనా పట్ల భయాందోళనలు అక్కెరలేదని తెలిపారు. అయితే అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరించడం, సానిటైజేషన్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని  తెలిపారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం నడుస్తుందని, తల్లిదండ్రులు అశ్రద్ద చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలన్నారు. సోమవారం నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని చెప్పారు.  

అర్హులైన వారందరూ తప్పనిసరిగా వాక్సినేషన్ చేయించుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకోవాలన్నారు. రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరిండ్లల్లో వారు  తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు.  ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా రెడీగా ఉందన్న కేసీఆర్.. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను, రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితులు సహా కరోనా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గత రివ్యూ సందర్భంగా సీఎం చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అధికారులు సీఎంకు నివేదించారు. ఆక్సీజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ రెడీగా ఉన్నాయని అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు.