హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ప్రసాదాలు, ఇతర నైవేద్యాలకు వాడే నెయ్యి, ఇతర ఆహార పదార్థాలు ప్రమాణాలకు తగ్గట్టుగా లేవంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉంటున్నాయని యుగతులసీ ఫౌండేషన్ చైర్మన్ కె.శివకుమార్, ఇతరులు పిల్ వేశారు. పిల్కు నెంబర్ కేటాయింపునకు రిజిస్ట్రీ అభ్యంతరం చెప్పడంపై మంగళవారం చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ బెంచ్ విచారించింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సుశీలరామ్, సునీల్కుమార్, పరీక్షిత్ వాదనలు వినిపించారు. ‘‘వేంకటేశ్వర స్వామికి సమర్పించే నైవేధ్యం, ప్రసాదాల్లో స్వచ్ఛమైన స్వదేశీ ఆవు పాలు, నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని గతంలో బోర్డు ఆమోదించింది. ఈ తీర్మానాన్ని టీటీడీ అమలు చేయడం లేదు. ప్రసాదాల నాణ్యత, పవిత్రతపై భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
స్వామి ఆరాధనకు వర్తించే ఆగమ శాస్త్ర పద్ధతుల ప్రాముఖ్యత, దీర్ఘకాలంగా కొనసాగుతున్న మతపరమైన ఆచారాలను పాటించాల్సిన బాధ్యత ఆలయ యంత్రాంగంపై ఉంది. ఆర్టికల్ 25 ప్రకారం.. మతపరమైన ఆచారాలను సంప్రదాయబద్ధంగా పాటించే రాజ్యాంగపరమైన హక్కును రక్షించాలి. మతపరమైన ఆచారాలు, విశ్వాసాల్లో జోక్యం చేసుకోవాలని తాము కోరడం లేదు.
కేవలం టీటీడీ స్వయంగా ఆమోదించి, భక్తులకు వాగ్దానం చేసిన నాణ్యతాప్రమాణాలను పాటించేలా చూడాలని కోరుతున్నాం. తెలంగాణలోనూ అనేక ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలు ఉన్నందున ఇక్కడ పిటిషన్ వేయడం, హైకోర్టు విచారణ చేయడం సమర్థనీయమే. విచారణ పరిధిపై ఎలాంటి వివాదం రాదు. భక్తుల విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉంది. జోక్యం చేసుకుని బోర్డుకు స్పష్టమైన ఆదేశాలు చేయాలి’’అని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. రిజిస్ట్రీ అభ్యంతరాలపై తమ నిర్ణయాన్ని తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది.
