
న్యూఢిల్లీ: వెంచర్ క్యాపిటలిస్ట్లు టెమాసెక్, పీక్ ఎక్స్వీ పార్టనర్స్కు వాటాలున్న ఫిన్టెక్ కంపెనీ పైన్ ల్యాబ్స్ త్వరలో ఐపీఓకి రానుంది. సెబీ అనుమతులు పొందేందుకు ప్రిలిమినరీ పేపర్లను సబ్మిట్ చేసింది. ఈ పబ్లిక్ ఇష్యూలో రూ.2,600 కోట్ల విలువైన ఫ్రెష్ ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. మరోవైపు 14.78 కోట్లకు పైగా షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద షేర్హోల్డర్లు విక్రయించనున్నారు.
ఈ ఓఎఫ్ఎస్లో పీక్ ఎక్స్వీ పార్టనర్స్, లండన్ కంపెనీ ఆక్టిస్, పేపాల్, మాస్టర్కార్డ్ ఆసియా/పసిఫిక్, టెమాసెక్ (మాక్రిచీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా), ఇన్వెస్కో, మాడిసన్ ఇండియా క్యాపిటల్, ఎండబ్ల్యూఎక్స్ఓ డిజిటల్ ఫైనాన్స్ ఫండ్ , లోన్ కాస్కేడ్ ఎల్పీ, పైన్ ల్యాబ్స్ ఫౌండర్ లోక్వీర్ కపూర్ తమ షేర్లను అమ్మనున్నారు.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.520 కోట్లను సేకరించాలని కూడా కంపెనీ చూస్తోంది. ఫ్రెష్ ఇష్యూ నుంచి వచ్చే ఫండ్స్లో రూ. 870 కోట్లను అప్పులు తీర్చడానికి, రూ.760 కోట్లను ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ డెవలప్మెంట్కు, డిజిటల్ చెక్అవుట్ పాయింట్ల కొనుగోలుకు ఉపయోగిస్తారు. కంపెనీ కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.1,208.2 కోట్ల రెవెన్యూపై రూ.26.14 కోట్ల నికర లాభం సాధించింది.