- మోదీ ‘నారాజ్ ఫూపా’ కామెంట్లపై ఖర్గే ఫైర్
- వర్సిటీలను పొలిటికల్ ప్రచార వేదికలుగా మార్చారని విమర్శ
న్యూఢిల్లీ, వెలుగు: సొంత వైఫల్యాలను కప్పిపుంచుకోవడానికి ప్రతిపక్షాలకు ప్రతి ఏటా ఒక కొత్త పేరు పెట్టడం ప్రధాని నరేంద్ర మోదీకి అలవాటుగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. శనివారం ఢిల్లీ యూనివర్సిటీ శ్రీ రామ్ కాలేజ్ శతజయంతి వేడుకల్లో ప్రసంగించిన ప్రధాని.. ఆ వేదికను మరో రాజకీయ ప్రచార వేదికగా మార్చారని విమర్శించారు.
మోదీ కొత్తగా ‘నారాజ్ ఫూపా(అలిగిన మేనమామ లేదా బాబాయ్)’ అనే పేరును తెరపైకి తేగా.. దానిపై ఖర్గే ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘నరేంద్ర మోదీజీ ఢిల్లీ వర్సిటీలోని ఎస్ఆర్సీసీ కాలేజీకి వెళ్లారు. దేశంలోని యువత, చదువు, వారి భవిష్యత్తు గురించి మాట్లాడటానికి ఇది మంచి అవకాశం. కానీ యువత ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, ఆ ప్రసంగాన్ని మళ్లీ రాజకీయ ప్రచారంలా మార్చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నలు అడగకుండా ఆపడానికి, ప్రతిపక్షాలపై ప్రతి ఏటా కొత్త పేర్లు పెట్టడం.. తద్వారా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం మీకు అలవాటే కదా! నారాజ్ ఫూపా, దిమాగీ నక్సల్, అర్బన్ నక్సల్, ఖాన్ మార్కెట్ గ్యాంగ్.. సంవత్సరానికో కొత్త పేరు మారుస్తారు. కానీ, మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పనులు మాత్రం మారవు” అని విమర్శించారు.
‘‘మీరు ప్రజలకు అందుబాటులో ఉండకుండా పోయినందువల్లే, ఇలాంటి పర్యటనలు చేయాల్సి వస్తోంది. ప్రధాని తన రిపోర్టు కార్డును చూపించారు. అలాగే, దేశ యువత కూడా తమ అసలైన సొంత రిపోర్ట్ కార్డుతో సిద్ధంగా ఉంది.
నిరుద్యోగం, ఏళ్ల తరబడి కానరాని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, పేపర్ లీకేజీలతో అల్లాడుతున్న విద్యార్థులు, ఆకాశానికి చేరిన చదువు ఖర్చులు, తగ్గిపోయిన స్కాలర్షిప్లు, యూనివర్సిటీల స్వతంత్రతపై పెరుగుతున్న ఒత్తిడి. ఇవీ యువత రిపోర్ట్ కార్డులో ఉన్నవి" అని ఖర్గే గుర్తుచేశారు.
ఛాత్రోన్ కీ గూంజ్
నినాదంతో విద్యార్థులు లేవనెత్తుతోన్న అంశాలను విస్మరించవద్దని హెచ్చరించారు. దేశ భవిష్యత్తు కోసం నిలదీస్తున్న యువత ఆక్రోశాన్ని ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని హితవు పలికారు.
