
- మహిళ అనుమానాస్పద మృతి కేసునుసాల్వ్ చేసిన పోలీసులు
- నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన అరుణ్ కుమార్ అరెస్టు
- ఫ్రెండ్ భార్యను నమ్మించి వెంట తీసుకెళ్లిన నిందితుడు
- మెదక్ జిల్లా రామాయంపేట దగ్గర అత్యాచారం, హత్య
- కేసు వివరాలు వెల్లడించిన తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్
మెదక్, రామాయంపేట, వెలుగు: తన ఫ్రెండు భార్యపైనే కన్నేశాడు. స్నేహితుడు లేని సమయంలో మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. దోచుకొచ్చిన నగలు దాచిపెట్టానని, అవి ఇస్తానని వెంట తీసుకెళ్లి ఆమెను రేప్ చేసి దారుణంగా చంపేశాడు. మెదక్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఈనెల 5న రామాయంపేట శివారులోని కొత్త చెరువు ప్రాంతంలో మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు సాల్వ్ చేశారు. నిందితుడు అరుణ్ కుమార్ను బుధవారం అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ వెల్లడించారు.
డబ్బులు, బంగారం ఉన్నాయని చెప్పి..
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లికి చెందిన అరుణ్ కుమార్ పలు నేరాలు చేసి జైలుకు వెళ్లివచ్చాడు. ఏడాదిన్నరపాటు చంచల్గూడ జైలులో ఉండి.. ఈ మధ్య బెయిల్పై విడుదలయ్యాడు. సొంతూరు సుద్దపల్లిలో ఉంటూ కోర్టుకు హాజరవుతున్న క్రమంలో అరుణ్ కుమార్కు నిజామాబాద్కు చెందిన రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
అరుణ్ గత నవంబర్ 30న కేసు విషయంలో రాజుకు ఫోన్ చేయగా.. అతడి భార్య ఎత్తి మాట్లాడింది. తర్వాత డిసెంబర్2న కోర్టు వద్ద ఆమెను కలిశాడు. ఆమెను లోబర్చుకోవాలనే ఉద్దేశంతో తన ఇంటికి తీసుకెళ్లి టీవీని గిఫ్ట్గా ఇచ్చాడు. రాజు ఓ కేసులో ఇరుక్కుని జైల్లో ఉన్నాడని తెలిసి… ఆమెను కలిసేందుకు ఇంటికి వెళ్లాడు. షాపింగ్ మాల్కు తీసుకెళ్లి కొన్ని వస్తువులకు ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత తాను దొంగతనాలు చేసి చాలా డబ్బులు, బంగారం సంపాదించానని.. వాటిని ఒకచోట భూమిలో దాచిపెట్టానని చెప్పి నమ్మించాడు. పాతిపెట్టిన డబ్బులు, బంగారం తీసుకొద్దామని చెప్పి ఈనెల 5న నిజామాబాద్లో ఆమెను స్కూటీపై ఎక్కించుకుని రామాయంపేట శివారులోని కొత్త చెరువుకు పిలుచుకెళ్లాడు. రాత్రి 7:30 గంటల సమయంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. దీంతో ఆమెకు అతనిపై అనుమానం వచ్చి అసలు డబ్బులు ఇక్కడ ఉన్నాయా? లేవా? అని గట్టిగా నిలదీసింది. దీంతో ‘నీవు డబ్బుల కోసమే నా వెంట వచ్చావా? అరిస్తే చంపుతా’ అని బెదిరించాడు. తర్వాత ఆమెను రేప్ చేశాడు. విషయం ఎవరికైనా చెబుతుందనే ఉద్దేశంతో ఆమె ఛాతిపై కూర్చుని గొంతు పిసికాడు. మఫ్లర్ ను గొంతుకు బిగించి హత్య చేశాడు. తర్వాత పక్కనే ఉన్న నీటి గుంతలో డెడ్ బాడీని పడేశాడు. బాధితురాలి రెండు సెల్ఫోన్లు, ఆధార్ కార్డులను, స్కూటీ ఆర్సీ, లైసెన్స్లను కాల్చేశాడు.
ఎత్తుకెళ్లిన స్కూటీపైనే దర్జాగా వెళ్తూ..
బాధితురాలి స్కూటీతో వెళ్లిపోయిన అరుణ్.. తన ఫోన్ సిమ్ కార్డులను తీసేసి ఆరోజు ఇంట్లోనే ఉన్నాడు. మరుసటి రోజు నిజామాబాద్కు వెళ్లి స్కూటీ నంబర్ ప్లేట్ తీసేసి దానిమీద ప్రెస్ అని రాయించాడు. బుధవారం ఉదయం స్కూటీపై నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు బయలుదేరాడు. దామరచెరువు బైపాస్ రోడ్లో పోలీసులు వెహికల్స్చెక్ చేస్తుండగా.. అరుణ్ తీరు అనుమానాస్పదంగా కనిపించింది. మృతి చెందిన మహిళ స్కూటీ చాసిస్ నంబర్ అరుణ్ వద్ద ఉన్న స్కూటీ చాసిస్ నంబర్ మ్యాచ్ కావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా మహిళను తానే హత్య చేసినట్టు అతడు అంగీకరించాడు.
మూడు పెళ్లిళ్లు
అరుణ్కు 2015లో నిజామాబాద్ జిల్లా దుబ్బకు చెందిన జ్యోతితో పెళ్లి జరిగింది. అతని ప్రవర్తన నచ్చక 3 రోజులకే దర్పల్లి పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టి తర్వాత విడాకులు తీసుకుంది. తర్వాత 6 నెలలకు ముదోల్ గ్రామానికి చెందిన నవనీతను పెళ్లి చేసుకున్నాడు. 8 నెలల తర్వాత ఆమె కూడా విడాకులిచ్చింది. తర్వాత ఆర్మూర్ మండలానికి చెందిన లావణ్యను పెళ్లి చేసుకున్నాడు.