11 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు 84 ఏండ్ల వృద్ధుడి ప్రకటన

11 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు 84 ఏండ్ల వృద్ధుడి ప్రకటన

మాధేపురా: బీహార్‌‌లోని మాధేపురా జిల్లా పరైనీకి చెందిన బ్రహ్మదేవ్ మండల్‌ అనే 84 ఏండ్ల వృద్ధుడు 11 డోసుల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నానని ప్రకటించుకున్నాడు. తాను అన్ని సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నా ఎటువంటి అనారోగ్యం బారినపడలేదని చెప్పాడతను. పైగా తన ఆరోగ్యం మరింత మెరుగుపడిందన్నాడు. అయితే అతడి ప్రకటనపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానిజాలు తేల్చేందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని మాధేపురా సివిల్ సర్జన్ డాక్టర్ అమరేంద్ర ప్రతాప్ సాహి చెప్పారు. ఆస్పత్రి రికార్డులు చెక్ చేసి ఒక వేళ నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు, ఇలా ఏకంగా 11 సార్లు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రకటించిన బ్రహ్మదేవ్ మండల్‌పై పురైనీ పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిపై స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కంప్లైంట్ ఇవ్వడంతో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు. అతడి వ్యాఖ్యలు నిజమా? కాదా?, అన్ని సార్లు వ్యాక్సిన్ తీసుకోవడం ఎలా సాధ్యం అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.