రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేసిండు..ఇంకా మోసం చేయాలని చూస్తున్నడు: మంత్రి పొంగులేటి

రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేసిండు..ఇంకా మోసం చేయాలని చూస్తున్నడు: మంత్రి పొంగులేటి
  • ఆగవ్వతో కలిసి అన్నం తిని.. వాసాలమర్రిని బాగు చేస్తా అన్నడు
  • మళ్లా ఊరు ముఖం కూడా చూడలేదు
  • మేము ఊళ్లో 205 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినమని వ్యాఖ్య
  • సూర్యాపేటలో నిర్మాణ పనుల పరిశీలన

యాదాద్రి/సూర్యాపేట/యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రాన్ని కేసీఆర్ పదేండ్లు ఆగం చేశారని.. ఇప్పుడు మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్​తో జర జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు ఆయన సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నదని తెలిపారు. తప్పును ఒప్పుగా.. ఒప్పును తప్పుగా చూపించి రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేస్తే.. తాము బాగు చేస్తున్నామని అన్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు.

భువనగిరి మండలం బండసోమారంలో ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు కొత్త బట్టలు అందజేశారు. సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన తర్వాత మంత్రి పొంగులేటి మాట్లాడారు. ‘‘వాసాలమర్రిలో ఆగవ్వతో కలిసి కేసీఆర్ అన్నం తిన్నడు. ఊరును మాత్రం ఆయన బాగు చేయలే. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ నెల 6వ తేదీన ఇచ్చిన హామీ మేరకు ఒక్క వారంలోనే వాసాలమర్రిని బాగు చేసిండు. ఆగవ్వతో పాటు 205 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినం. కేసీఆర్ హామీ ఇచ్చి ఆగం చేస్తే.. మేము హామీ ఇచ్చిన వారం రోజుల్లోనే వాసాలమర్రి బాగు చేసినం’’అని మంత్రి పొంగులేటి అన్నారు.

లక్షల కోట్ల అప్పులు చేసిన్రు

కాళేశ్వరం పేరుతో కమీషన్లు తీసుకొని, పదేండ్ల కాలంలో రూ.8.19 లక్షల కోట్లు అప్పులు చేశారని మంత్రి పొంగులేటి విమర్శించారు. తాము మాత్రం సంక్షేమం, అభివృద్ధి పనులు కొనసాగిస్తూ ప్రతి నెలా అసలు కొంచెం వడ్డీ కలిపి రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నాం. ‘‘ధరణి తీసుకొచ్చి ప్రభుత్వ భూములను కేసీఆర్ ఖతం చేసిండు. మేము భూభారతి చట్టంతో భూములు కాపాడుతున్నాం.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిలో పడ్తున్నది. కొంత లేట్ అయినా.. ఇచ్చిన హామీని నెరవేరుస్తాం’’అని పొంగులేటి అన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ చామల కిరణ్ కుమర్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరయ్యారు.

అర్హులైన వారందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తం

పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. బొమ్మలు చూపించి ఓట్లు వేయించుకున్నారని మంత్రి పొంగులేటి aమండిపడ్డారు. ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ‘‘ఇందిరమ్మ సర్కార్ అంటే.. పేదోడి ప్రభుత్వం. అందుకే పేదోడి చిరకాల వాంఛ అయిన సొంతింటి కలను సాకారం చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా.. ఈ ఏడాదిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. రాబోయే రోజుల్లో మొత్తం 20 లక్షల ఇండ్లు నిర్మించి ఇస్తాం. వచ్చే ఎన్నికల నాటికి అందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తాం. సబ్సిడీపై గ్యాస్, 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్, మహిళలకు ఫ్రీ బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం’’అని పొంగులేటి తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. ఇవన్ని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.