
నారా రోహిత్ హీరోగా వస్తున్న చిత్రం ‘ప్రతినిధి 2’. మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. శుక్రవారం దర్శకుడు సుకుమార్ ఈ మూవీ ట్రైలర్ను లాంచ్ చేసి, బెస్ట్ విషెస్ చెప్పారు. ‘ఒక సీఎం చనిపోయాక రాష్ట్రమంతా హింసాత్మక నిరసనలు జరుగుతాయి. మహాత్మా గాంధీ మరణించిన తర్వాత గుండెపోటుతో ఎంత మంది చనిపోయారు’ అని జర్నలిస్ట్ పాత్రలో నారా రోహత్ అడిగిన ప్రశ్నతో ట్రైలర్ మొదలైంది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ రాబోయే ఎన్నికల్లో గెలుపుపై లీడింగ్ పార్టీకి అనుమానాలు ఉంటాయి. మరోవైపు ప్రత్యేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న హీరోని పోలీసులు అనుమానిస్తుంటారు. మొత్తానికి ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రాజకీయాలను గుర్తు చేసేలా కట్ చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సిరీ లెల్లా, సచిన్ ఖేడేకర్, దినేష్ తేజ్, రఘుబాబు, జిషు సేన్గుప్తా, ఉదయ భాను, అజయ్ ఘోష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.