అబార్షన్ బిల్లులో మార్పులు..ఆర్నెల్ల దాకా ఓకే

అబార్షన్ బిల్లులో మార్పులు..ఆర్నెల్ల దాకా ఓకే

న్యూఢిల్లీ:  అబార్షన్​కు అనుమతించేందుకు ఇప్పటి వరకున్న 20 వారాల గడువును 24 వారాలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్​ఓకే చెప్పింది. డాక్టర్లు, మహిళలు డిమాండ్​ చేస్తున్నట్లు 6 నెలల్లోపల అబార్షన్​ చేసుకోవడానికి సమ్మతించింది. మెడికల్​ టెర్మినేషన్​ ఆఫ్​ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ– అమెండ్​మెంట్) బిల్​2020కు ఆమోదం తెలిపింది. ఈ సవరణ బిల్లును శుక్రవారం నుంచి మొదలయ్యే బడ్జెట్​ సమావేశాల్లోనే  పార్లమెంట్​లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. బుధవారం ఢిల్లీలో జరిగిన కేబినెట్​ మీటింగ్​ తర్వాత కేంద్ర మంత్రి ప్రకాశ్​ జవడేకర్​ మీడియాతో మాట్లాడారు. అబార్షన్ లిమిట్ పెంచడం ద్వారా వద్దనుకున్న గర్భాన్ని జాగ్రత్తగా తొలగించుకునే అవకాశంతో పాటు మహిళలకు వారి శరీరాల మీద రీప్రొడక్టివ్​ హక్కులను కల్పించామని చెప్పారు.

అత్యాచార బాధితులు, మైనర్లు, వైకల్యంతో బాధపడుతున్న వారు.. గర్భందాల్చినా కూడా ఐదు నెలల్లో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు తర్వాత అబార్షన్​ కోసం కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని మంత్రి చెప్పారు. తాజా ప్రతిపాదన ద్వారా అలాంటి కేసుల్లో బాధితులకు ఊరట లభిస్తుందని వివరించారు. మెటర్నల్​ మోర్టాలిటీ కూడా తగ్గుతుందని మంత్రి జవడేకర్​ అన్నారు.

ఈ బిల్లులో కీలక విషయాలు..

20 వారాల్లోపల అబార్షన్​కు ఓ డాక్టర్​ సలహా సరిపోతుంది. 20 వారాలు దాటితే ఇద్దరు డాక్టర్ల(ఒక ప్రభుత్వ డాక్టర్) అభిప్రాయం తప్పనిసరి.

అబార్షన్​ చేసుకున్న మహిళ వివరాలను బయటికి వెల్లడించొద్దు.. ఇప్పుడున్న చట్టాల్లో దీనికి సంబంధించి వెసులుబాటు ఉంటే ఆ చట్ట ప్రకారం అనుమతి పొందిన వారికి చెప్పొచ్చు. పిండం ఎదుగుదలలో అసాధారణ లోపాలకు సంబంధించిన కేసులకు ఈ అబార్షన్​ గడువు వర్తించదు. అంటే.. 20 వారాల తర్వాత పిండంలో లోపాలు బయటపడితే అబార్షన్​ చేయడానికి  వీలులేదు. ఈ కేసుల్లో అబార్షన్​ గడువులో ఎలాంటి మార్పులేదు.

ఈ సవరణలకు సంబంధించిన విధివిధానాల్లో మెడికల్​ బోర్డ్​ సమయానుసారంగా మార్పులు చేర్పులు తీసుకొస్తుంది. హ్యుమానిటేరియన్, సోషల్​గ్రౌండ్స్​కింద మహిళలకు సేఫ్, లీగల్​ అబార్షన్​ సర్వీస్​ను అందించడానికే ఎంటీపీ చట్టానికి సవరణలను ప్రతిపాదించినట్లు కేంద్రం వెల్లడించింది.