Success News: ఏడుగురు కమాండోలకు శౌర్యచక్రప్రదానం

Success News: ఏడుగురు కమాండోలకు శౌర్యచక్రప్రదానం

వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసే క్రమంలో అమరులైన ఇద్దరు సీఆర్​పీఎఫ్ కానిస్టేబుళ్లతోపాటు మరో ఐదుగురికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్యచక్ర పురస్కారాలను ప్రదానం చేశారు. మావోయిస్టులకు పట్టున్న చత్తీస్​గఢ్ సుక్మా జిల్లాలోని టేకల్​గూడలో 2024, జనవరి 30న సీఆర్​పీఎఫ్ బెటాలియన్  ఫార్మర్డ్ ఆపరేటింగ్ బేస్ ఏర్పాటును ప్రారంభించింది. ఆ సమయంలో బారెల్ గ్రనేడ్ లాంచర్లు, ఇంప్రొవైజ్డ్ మిస్సైల్​తో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. 

తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా 201 కోబ్రా బెటాలియన్​కు చెందిన కానిస్టేబుల్ పవన్ కుమార్, తోటి కానిస్టేబుల్ దేవన్​తో కలిసి తెగువతో పోరాడారు. వారి అసాధారణ ధైర్యం, పరాక్రమానికి మరణానంతరం శౌరచక్ర పతకాలు లభించాయి. ఈ వీరుల కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి మే 22న పతకాలు అందజేశారు. 201 కోబ్రా బెటాలియన్​కు చెందిన డిప్యూటీ కమాండెంట్ లఖ్వీర్, అసిస్టెంట్ కమాండెంట్ రాజేశ్ పంచల్, కానిస్టేబుల్ మల్కిత్ సింగ్ చూపిన అసాధారణ ధైర్యానికి శౌర్యచక్ర అందుకున్నారు. 

లఖ్వీర్ పేలుళ్లలో గాయపడగా, పంచల్ కుడి చేతికి తూటా తగిలింది. పవన్ కుమార్ మృతదేహం కోసం ఛాతికి గాయమైనా మల్కిత్​సింగ్ తుపాకీ గుళ్లకు ఎదురెళ్లి ఎంతోమంది మావోయిస్టులను కాల్చి చంపాడు. 2023, ఏప్రిల్ 3న జార్ఖండ్ ఛత్రా జిల్లాలో జరిగిన మరో ఆపరేషన్​లో పరాక్రమం చూపి సీఆర్​పీఎఫ్ 203కోబ్రా బెటాలియన్​కు చెందిన డిప్యూటీ కమాండెంట్ విక్రాంత్ కుమార్, ఇన్​స్పెక్టర్ జెఫ్రీ హమింగ్ చుల్లో శౌర్యచక్ర అందుకున్నారు. మావోయిస్టులతో 50 నిమిషాలపాటు జరిగిన బీకర పోరులో వీరు ఐదుగురు మావోయిస్టు అగ్రనేతను చంపారు.