
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు. నిపుణలైన డ్రైవర్లు లేకుండా బస్సులు నడిపిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు ట్రావెల్స్ యజమానులు. 2024 జూన్ 18వ తేదీన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బస్సు డివైడర్ పైకెక్కి రోడ్డుపైనున్న సీసీ కెమెరా స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే రోడ్డు ప్రమాదం జరిగినట్లు ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ఆరాంఘర్ చౌరస్తా నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ఈ ఘటన తెల్లవారుజామున జరగడం, ఆపైగా సిగ్నల్ కూడా పడడంతో అటు సైడ్ ఎవరు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.