ప్రియాంకకు హిమాచల్ సీఎం ఎంపిక బాధ్యత..!

ప్రియాంకకు హిమాచల్ సీఎం ఎంపిక బాధ్యత..!

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి సీఎం క్యాండిడేట్ ను ఎంపిక చేయడం తలనొప్పిగా మారింది. సీఎం పదవీకి తీవ్ర పోటీ నెలకొనడంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. అయితే ఆ రాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే దానిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తుది నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ఇప్పటికే ఆమోదించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారన్న దానిపై ఆదివారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ ప్రచారానికి ప్రియాంక గాంధీ నాయకత్వం వహించారు. ఖర్గేతో కలిసి అనేక ర్యాలీల్లో పాల్గొన్నారు. పార్టీ గెలుపునకు అనేక వ్యూహరచనలు చేశారు. ఆమె నాయకత్వాన్ని పలువురు నేతలు ప్రశంసించారు. ఎన్నికల బాధ్యతల్లో ప్రియాంకకు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆమె నాయకత్వం వహించగా అక్కడ కాంగ్రెస్  ఓడిపోయింది.

సీఎం పదవీ రేసులో ప్రతిభా సింగ్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ గా, ఎంపీగా ఆమె కొనసాగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించిన ఆమె.. అసెంబ్లీకి మాత్రం పోటీ చేయలేదు. కానీ  సీఎం పదవిని తాను ఆశిస్తున్నట్లు, రాష్ట్రాన్ని నడిపించగలని ప్రకటించారు. దీంతో  ప్రతిభాకే సీఎం పదవి ఇవ్వాలని ఆమె మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.