హాకీ ఆటగాళ్లకు కాషాయం రంగు చొక్కాలు : మార్పుపై రాజకీయ మరక

హాకీ ఆటగాళ్లకు కాషాయం రంగు చొక్కాలు : మార్పుపై రాజకీయ మరక

Hockey India Jersey Row: నెదర్లాండ్స్, బెల్జియం వేదికలుగా జరగనున్న 2026 ఎఫ్‌ఐహెచ్ (FIH) హాకీ ప్రపంచకప్‌నకు ముందు హాకీ ఇండియా తీసుకున్న ఒక నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దశాబ్దాలుగా భారత క్రీడారంగానికి, హాకీకి చిహ్నంగా ఉన్న ఐకానిక్ బ్లూ కలర్ జెర్సీ స్థానంలో పురుషుల, మహిళల జట్లకు కాషాయం (Saffron) రంగును ప్రాథమిక రంగుగా ఖరారు చేశారు. ఈ మార్పుపై క్రీడా వర్గాలతో పాటు రాజకీయ కోణంలోనూ తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

దేశ గుర్తింపును మార్చే కుట్ర: ప్రియాంక గాంధీ 
ఈ జెర్సీ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా మండిపడింది. కేంద్ర ప్రభుత్వం దేశ ముఖచిత్రాన్ని, మన మూల గుర్తింపును మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. యూనిఫాంలు మార్చినా, విద్యా విధానాల ద్వారా చరిత్రను తిరగరాయాలని చూసినా ఫలితం ఉండదు.. దీనిపై దేశ యువత ఆలోచన ఏంటో మీరు చూశారు.. జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్న యువత ఏం చెబుతున్నారో విన్నారు కదా.. అదే ఈ దేశ స్వరం అని పేర్కొన్నారు. హాకీ జెర్సీ మార్పును విద్యా విధానంలో ప్రతిపాదించిన మార్పులతో, యువత చేపడుతున్న నిరసనలతో ప్రియాంక ముడిపెట్టారు.

ఇది అత్యంత సిగ్గుచేటు.. మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా: 
హాకీ ఇండియా నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా తీవ్రంగా తప్పుపట్టారు. జెర్సీ రంగు మార్చడాన్ని సిగ్గుచేటు (Embarrassing) గా అభివర్ణించారు. అంతర్జాతీయ వేదికలపై నీలం రంగు అనేది భారత హాకీకి, క్రీడాకారులకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఐడెంటిటీని ఇచ్చిందని, అలాంటి చారిత్రక గుర్తును మార్చడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రస్కిన్హా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవ్వగా, క్రీడాభిమానులు కూడా రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

క్రీడాంశం నుంచి రాజకీయ వివాదంగా: 
కేవలం ఒక క్రీడా పరిణామాలుగా ప్రారంభమైన ఈ వివాదం, ప్రతిపక్ష నేతల రంగ ప్రవేశంతో రాజకీయ అంశంగా మారింది. శతాబ్ద కాలంగా భారత హాకీకి ప్రాతినిధ్యం వహించిన బ్లూ జెర్సీని తొలగించడం వెనుక రాజకీయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, కొత్త రూపం భారత జట్టుకు సరికొత్త ఊపునిస్తుందని బీజేపీ మద్దతుదారులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ప్రపంచకప్ ముందు హాకీ ఇండియా తీసుకున్న ఈ కాషాయ జెర్సీ నిర్ణయం ప్రస్తుతం జాతీయ స్థాయిలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.